‘తొందరి పడి ఓ కోయిల ముందే కూసింది’.. అని సినీకవి వర్ణించిన విధంగా పెబ్బేరు మండలంలోని కొన్ని మామిడి చెట్లు ముందుగానే కాయలు కాశాయి. అక్టోబర్ నుంచే మామిడిచెట్లు పూత పూశాయి. కొన్ని చెట్లకు కాయలు, పూత ఒకేసారి వచ్చాయి. ఈ చెట్లు శీతాకాలంలోనే విరగకాసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. అయితే జనవరిలో కాసిన కాయలను తెంచిన తర్వాత మళ్లీ పూత రావడం ఇక్కడి చెట్ల ప్రత్యేకం. జనవరిలో కాయలు కాయగా.. 13 టన్నులు ఎగుమతి కూడా చేశారు. 20 ఏండ్లుగా తోటలు లాభాలు కురిపి స్తున్నాయి. ఈ విషయం తెలుసుకొని మామిడి రైతులు బ్రహ్మానందరెడ్డి, సిద్ధేశ్వర్రెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభినందించారు. కాయల గురించి తెలుసుకున్న వ్యాపారులు నేరుగా తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
పెబ్బేరు, మార్చి 12: ఎండాకాలంలో ఎక్కడ చూసినా మామిడితోటలు కాయలు, పండ్లతో నిండుగా కనిపిస్తాయి. ఉగాది పండుగ తర్వాత ఏప్రిల్, మే నెలలో పండ్లు చేతికొచ్చి మార్కెట్ను ముంచెత్తుతాయి. ఇందుకు భిన్నంగా శీతాకాలంలోనే మామిడికాయలు కాస్తున్నాయంటే ఎవరికైనా ఆశ్యర్యమే.. కానీ, ఇది నిజం.. పెబ్బేరులోని ఓ రైతు తోటలో శీతాకాలంలోనే మామిడిచెట్లకు పండ్లు, కాయలు కాయడంతో ఆసక్తి కలిగిస్తున్నది. జనవరిలో పూత దశ ప్రారంభమైతే ఈ తోటలో ఏకంగా పండ్లు చేతికొస్తున్నాయంటే ఆశ్యర్యం లేదు. ఈ తోట అక్టోబర్లో పూత చిగురించి జనవరిలో కాపుకొచ్చింది. జనవరి, ఫిబ్రవరి నెలలో ఏకంగా 13టన్నులు ఎగుమతి చేశాడట. ఈ విషయమై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి రైతును అభినందించారు. శీతాకాలంలో పండిన పండ్లను చూసి ఆయనే ఆశ్చర్య పోయారు. వివరాల్లోకి వెళితే..
ఈ తోట వెరీ స్పెషల్ గురూ..
పెబ్బేరుకు చెందిన బ్రహ్మానందరెడ్డి, సిద్దేశ్వర్రెడ్డి రైతులు ఎనిమిది ఎకరాల్లో మామిడి తోటను సాగు చేస్తున్నారు. తోట బంగినపల్లి రకం మామడికి ఫేమస్. దాదాపు 20ఏండ్లుగా ఈ తోటలో మామిడికాయలు, పండ్లు లాభాల పంట పండిస్తున్నాయి. గతేడాది ఏప్రిల్లోనే 18టన్నుల పండ్లను విక్రయించారు. ఆ తర్వాత ఆశ్చర్యంగా అక్టోబర్ నుంచే మామిడిచెట్లు మళ్లీ పూతకు వచ్చాయి. దీంతో రైతులు మామిడి తోటను జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారు. ఎక్కడాలేని విధంగా మా తోటలోనే ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించేలోగా ఈఏడాది జనవరి నెలలోనే కాయలు విరగకాశాయి. మామిడి కాపులో ఒక్కపండు కూడా వృథాకాకుండా తెంచారు. సుమారు 13 టన్నులు దిగుబడి వచ్చింది. శీతాకాలంలో బంగినపల్లి మామిడితోట విరగకాయడంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా మంత్రికి తెలిసింది. శీతాకాలంలో పండిన పండ్లను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రైతులను అభినందించారు.
కాయలు తెంపినా.. మళ్లీ పూత
శీతాకాలంలో మామిడి పండ్లు అమ్మిన రైతుకు మళ్లీ చెట్లకు పూత రావడం వింతగా మారింది. కొన్నిచెట్లకు జనవరిలో కాయలు తెంపగా.. మళ్లీ ఇప్పుడు పూతకు వచ్చాయి. ఒకే చెట్టుకు ఒక పక్క చేతికొచ్చిన కాయలు, మరో పక్క పూత చిగురించడం గమనార్హం. ఇది చూసి తోటి రైతులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని చుట్టుపక్కల రైతులు వచ్చి వింతను చూసి పోతున్నారు. దీంతో కృషి విజ్ఞన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు సైతం తోటను సందర్శించి చెట్లను పరిశీలించారు. ఈ ఏడాది రెండుసార్లు ఎందుకు కాపు కాసిందనే దానిపై పరిశోధన చేసి ఇది ముందస్తు పంటగా వచ్చిందని తేల్చారు. అయితే కొన్నిసార్లు కాయలు కాయడం జరుగుతుందని.. అయితే ఈ స్థాయిలో టన్నుల కొద్ది కాయలు కాయడంపై విస్త్రృతంగా పరిశోధన చేపడుతున్నట్లు వెల్లడించారు.
టన్నుకు రూ.లక్ష విక్రయం
ఈ తోటలో విరగకాసిన కాయలపై తెలుసుకున్న ముంబయికి చెందిన వ్యాపారులు నేరుగా తోట వద్దకే వచ్చి టన్నుకు రూ.1.05లక్షల చొప్పున 13 టన్నుల మామిడి పండ్లను తీసుకెళ్లారు. మరో 30 టన్నుల దాకా కాయలు చెట్లకు కాశాయి. ఈ ఏడాది మొత్తానికి 45టన్నుల దాకా దిగుబడి సాధించామని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. శీతాకాలంలో పండిన మామిడి పండ్ల విషయం తెలుసుకున్న అధికారులు, గ్రామస్తులు, తోటి రైతులు క్యూ కట్టారు. ఇలా రెండుసార్లు కాపు ఎలా వచ్చింది? జనవరిలో కాపు రావడం ఏంటని ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. శీతాకాలంలో పండినా రుచిలో, సైజులో ఏమాత్రం తగ్గకపోగా దిగుబడి రావడం రైతుల పంట పండించింది. ఇప్పటికే రూ.13లక్షల ఆదాయాన్ని చవిచూసిన ఈ రైతులకు మళ్లీ పూతపూసి కాయలు కాస్తుండటంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ తోట చుట్టుపక్కల అనేక తోటలు ఉన్నాయి. అయినా ఏ తోటలో మామిడి కాపుకు రాలేదు. ఇదిలా ఉండగా.. ఈదురుగాలులు, వడగండ్ల వాన, ధూళికి కాయలు రాలి నష్టపోతుంటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ముందస్తు మామిడి పంటలు పండితే బాగుంటుందని రైతులు అనుకుంటున్నారు.
దిగుబడి రాకతో సంతోషంగా ఉంది
గతేడాది తీవ్రంగా నష్టపోయాను. ఈ సారి కాపు కోసం తోటను జాగ్రత్తగా చూసుకున్నాం. సేంద్రియ ఎరువులతో పాటు మైక్రోన్యూట్రీన్స్ సైతం వినియోగించాం. కానీ, అక్టోబర్ నుంచే పూత పూయడం ప్రారంభం కావడంతో మాకే ఆశ్చర్యం వేసింది. ఏకంగా ఎప్పటిలాగే జనవరి నాటికి కాపుకొచ్చింది. 13టన్నులు విక్రయించాను. నేల, వాతావరణ పరిస్థితులు, మెళకువల వల్లే ఇది సాధ్యమై ఉండొచ్చు.
– సిద్దేశ్వర్రెడ్డి, రైతు, పెబ్బేరు