కల్వకుర్తి, ఏప్రిల్ 11 : రైతులు పండించిన ఏ పంట అయిన దిగుబడి ప్రారంభమైన తొలినాళ్లలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు మద్దతే ధర లభిస్తుంది. రైతులు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తాము పండించిన ధాన్యాన్ని విక్రయించి లాభపడతారు. అదే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ఆలస్యమైతే రైతులు నష్టపోతారు.
వ్యాపారులు లాభపడతారు. అదేం దురదృష్టమో గానీ రైతులు తమ పంట మొత్తం అమ్ముకున్నాక..అప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయి. ఇది ఎందుకు, ఎవరి కోసం జరుగుతుందో అన్నది రైతుల మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పటికే మక్కల దిగుబడి ప్రారంభమైంది..ఇప్పటి వరకు కల్వకుర్తి వ్యవసాయ డివిజన్ పరిధిలో మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు.
నాగర్కర్నూల్ జిల్లాలో 1.50లక్షల ఎకరాల్లో రై తులు మొక్కజొన్న సాగుచేశారని వ్యవసాయాధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వరికి ప్రత్యామ్నా య పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చేసిన విజ్ఞప్తుల నేపథ్యంలో రైతులు మక్కల సా గుపై దృష్టి సారించారు. యూరియా కోసం నానా కష్టాలు పడుతూ మక్క పంటలు పండించారు. దిగుబడి ఫర్వాలేదనిపించినా..మక్కల విక్రయం భారం గా మారింది.
ఇప్పటి వరకు కూడా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తక్కువ ధరకు వ్యాపారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ మధ్య మాత్రం నాగర్కర్నూల్, తాడూర్, తెలకపల్లి, అచ్చంపేటలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. కల్వకుర్తి డివిజన్ పరిధిలో ఎక్కడా మక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు.
మొక్కజొన్న కనీస మద్దతు ధర రూ.2,400. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో మక్క ధాన్యాన్ని రూ.1600 నుంచి రూ.1750 వరకు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మక్కరైతులు తాము పండించిన ధాన్యాన్ని వ్యాపారులకు వారు అడిగిన ధరకు విక్రయించాల్సి వస్తుంది. క్వింటాకు రూ.700 నుంచి రూ.800 వరకు నష్టం చవిచూడాల్సి వస్తుంది. ఇదే కాకుండా ధాన్యం కొనుగోలు విషయంలో వ్యాపారులు రకరకాల కొర్రీలు పెడతారు. తేమ శాతం ఎక్కువ ఉందని, మట్టి పెళ్లలు, ధుమ్ము దూళి ఉందని, క్వింటాకు నాలుగైదు కిలోల తరుగు తీస్తామంటారు.. ఇలా రకరకాల కారణాలతో కొనుగోలు చేసి రైతుల నెత్తిన పెద్ద కుచ్చుటోపి పెడతారు.
కల్వకుర్తి వ్యవసాయ డివిజన్ పరిధిలో మక్క ధాన్యం దిగుబడి ప్రారంభమైన ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించలేదనే ప్రశ్నలు రైతులనుంచి వినిపిస్తున్నాయి. పంటల సాగుకు పెట్టుబడి డబ్బులు అప్పులు తెచ్చామని, తెచ్చిన అప్పులకు మిత్తి పాపంలా పెరుగుతుందని, అప్పును తీర్చేందుకు ఏదో ధరకు మక్కలను అమ్ముకోవాల్సిన దుస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. అదే కొనుగోలు కేంద్రాలు తెరిస్తే..వాటిల్లోకి విక్రయించి మద్దతు ధర పొందుతామని భావిస్తే.. ఇప్పటికి కూడా కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికి వదిలేసిందని అందుకే..యూరియా కోసం తండ్లాట.. తీరా పంట ను అమ్ముకునేందుకు కష్టాలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలను నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదని, ఎవరో ఒక వ్యాపారికి ఏదో ధరకు విక్రయించాల్సిందేనని రైతుల వాపోతున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను మద్దతుగా నిలవాలని రైతు సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. దిగుబడి భాగానే వచ్చింది. తేమ లేకుండా పూర్తిగా ఆరబెట్టాను. ధాన్యాన్ని విక్రయించుదామనుకుంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. బయట వ్యాపారులకు అమ్ముదామనుకుంటే వారు రూ.1600 అడుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.2400 ఉంది. వ్యాపారికి అమ్మితే క్వింటాకు రూ.800 నష్టపోతాను. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే వరకు నిల్వ ఉంచుకునే స్థోమత లేదు. అప్పులు చెల్లించాలి, వాతావరణ భయపెడుతుంది. ఎప్పుడు వర్షం వస్తదో తెలియని పరిస్థితి. వ్యవసాయం దినదిన గండంగా మారింది. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి.
– సంతోష్ నాయక్, రైతు, జీడిపల్లి తండా, కల్వకుర్తి మండలం.
మక్కల దిగుబడి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయాం. ఎమ్మెల్యే స్పందించారు. వెంటనే వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడారు. లెటర్ కూడా పంపించారు. రెండు, మూడు రోజుల్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కల్వకుర్తి వ్యవసాయ డివిజన్ పరిధిలో మక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయి.
ధాన్యం రెడీగా ఉన్న రైతులు తమ ధాన్యాన్ని తాడూరు మండలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి అమ్ముకోవచ్చు. అందుకు సంబంధించిన కాగితాలను ఏఈల నుంచి తీసుకోవాలి. లేదా రెండు మూడు రోజులు ఓపిక పడితే కల్వకుర్తిలో మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రం ప్రారంభమవుతుంది.
– సురేశ్, వ్యవసాయాధికారి, కల్వకుర్తి మండలం