భయం వద్దు..కరోనా నుంచి కాపాడుకుంటాం
సీఎం కేసీఆర్ కరోనాపై ఆరా తీస్తున్నారు
మూడు మొబైల్ కొవిడ్ క్లినిక్ అంబులెన్సులతో సేవలు
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్ ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోన రెండో దశ ఉధృతంగా కొనసాగుతున్నదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నదని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ కు పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్నా… నిత్యం రాష్ట్రంలో కరోనా తీవ్రతపై ఆరా తీస్తూ, వైద్య సేవలను విస్తృతం చేయాలని సూచిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రజలెవరికీ కరోనాపై భయం వద్దని ఈ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకుంటామని మంత్రి తెలిపారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా నివారణలో భాగంగా అత్యధిక పీపీఈ కిట్లు, వ్యాక్సిన్ ఉత్పత్తి చేసింది తెలంగాణయేనని… ప్రపంచానికి అవసరమైన వాక్సిన్ లో 40 శాతం మన రాష్ట్రమే అందిస్తోందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ లేదని, ఆక్సిజన్ లేదని, పడకలు లేవని కొందరు అపోహలు సృష్టిస్తున్నారని నమ్మవద్దని సూచించారు. కరోనాను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, మెడికల్ కళాశాల తోపాటు, ప్రభుత్వ దవాఖానలో అవసరమైన పడకలు, ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో ఉన్నాయని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు మహబూబ్నగర్ జిల్లాలో 2,36,038 మందికి రాపిడ్ టెస్టులు, 22,760 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
తొలిసారిగా మొబైల్ కొవిడ్ క్లినిక్స్
గత సంవత్సరం సమర్థవంతంగా కరోనాను అరికట్టామని, ఈ ఏడాది రెండో దశ ఎక్కువగా ఉన్నప్పటికీ నియంత్రిస్తామన్నారు. జిల్లాలో బుధవారం నుంచి 3 కొవిడ్ ప్రత్యేక సంచార వైద్య సేవల అంబులెన్సులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ అంబులెన్సుల్లో డాక్టర్, జీఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్తో పాటు, ఆక్సిజన్, మందులు ఇతర అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు. ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చిందని అనుమానం వస్తే కాల్ సెంటర్ నెంబర్ 08542-241165 నంబర్కు ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇంటికే వచ్చి పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఇస్తారన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్లో ప్రారంభించినట్లు తెలిపారు.
అన్ని విధాలా సిద్ధం
గత సంవత్సరం కరోనా సమయంలో వలస కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని, ఈ సంవత్సరం కూడా కరోనాను అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. కరోనా రోగులకు దవాఖానలో ఉచితంగా వైద్యం, భోజనం అందిస్తామని, ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజల ప్రాణాలు కాపాడతామని తెలిపారు. కరోనా సేవలు అందించే స్థాయి ప్రైవేటు దవాఖానల్లో కనీసం 20శాతం పడకలు కరోనా రోగుల కోసం కేటాయించాలని, అవసరమైతే మొత్తం దవాఖానను కొవిడ్కు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాత్రి కర్ఫ్యూ పాటించాల్సిందిగా కోరారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి ఒక్కొక్కరికీ నెలకు 25కిలోల బియ్యం రెండు వేల రూపాయలను ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారన్నారు. ఇందులో భాగంగానే మహబూబ్నగర్ జిల్లాలో ముందుగా గుర్తించిన 1462 మందికి బియ్యంతో పాటు నగదును పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇందుకు రూ. 43.24లక్షల సాయం అందజేస్తునట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరం బయట కొవిడ్ ప్రత్యేక సంచార ఆరోగ్య వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అంతేకాక కొవిడ్ టాస్క్ఫోర్స్ వాహనాలను కూడా ప్రారంభించారు. కలెక్టర్ ఎస్.వెంకటరావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డా.రాంకిషన్, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణ, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ శశికాంత్, మున్సిపల్ చైర్మన్ కోరమోని నర్సింహులు, డీఎస్వో వనజాత హాజరయ్యారు.