స్టాక్ పాయింట్కు చేరిన పుస్తకాలు
విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పుస్తకాల పంపిణీకి చర్యలు
మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 17 : విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తూనే.. ముందుస్తుగా పాఠ్యపుస్తకాలు సరఫరా చేస్తున్నది. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పటికే పాఠ్యపుస్తకాలను చేరవేస్తున్నది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు సూమారు 2లక్షలపైగా పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, శుక్రవారం నాటికి 40వేలకుపైగా పుస్తకాలను సరఫరా చేసింది. ఈనెలాఖరులోగా పూర్తిస్థాయిలో సరఫరా చేయనున్నది. జిల్లా కేంద్రంలోని స్టాక్ పాయింట్లో పుస్తకాలను భద్రపర్చి విద్యాసంస్థల ప్రారంభానికే ముందే విద్యార్థులకు అందించేవిధంగా అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తున్నది.
జిల్లాలో 876 పాఠశాలలు..
జిల్లావ్యాప్తంగా 876 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 632 ప్రాథమిక, 90 ప్రాథమికోన్నత, 154 ఉన్నత పాఠశాలలు, 14 కేజీబీవీలు, ఒక మోడల్ స్కూల్, అర్బన్ రెసిడెన్షియల్ ప్రైమరీ, హైస్కూల్ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 74,632 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2021-22 విద్యాసంవత్సరానికి సుమా రు 2లక్షలకుపైగా పాఠ్య పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, పాఠ్యపుస్తకాలపై బార్కోడ్ ముద్రిస్తున్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా అందజేసే పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా నిర్దేశించిన వారి కే అందజేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
కార్గో బస్సుల్లో తరలింపు..
ఆర్టీసీకి ఆదాయం పెంపొందించడంలో భాగంగా ఏర్పా టు చేసిన కార్గో బస్ సర్వీసులను పాఠ్యపుస్తకాల తరలింపునకు వినియోగిస్తున్నారు. దీంతోపాటు అవసరమైతే జిల్లా కేంద్రంలోని స్టాక్ పాయింట్ నుంచి మండల కేంద్రాలకు కూడా పాఠ్యపుస్తకాలను తరలించనున్నారు. తద్వారా రవా ణా చార్టీలు చాలా వరకు కలిసి రానున్నాయి. మరోవైపు ఆర్టీసీకి ఆదాయం చేకూరనున్నది.