శ్రీశైలం, ఫిబ్రవరి 20 : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. భ్రమరాంబ మల్లికార్జునస్వామికి నిత్య పూజలు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం చండీశ్వరస్వామికి షోడశోపచార క్రతువులు నిర్వహించారు. అనంతరం ఈవో లవన్న, చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో రుద్రహోమం, పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచన పూజాధికాలు జరిపించారు.
ఆలయ పుష్కరిణిలో వైదిక శాస్ర్తోక్త అవబృథ స్నానం, వసంతోత్సవం నిర్వహించారు. మహాశివరాత్రి రోజున స్వామి, అమ్మవార్లకు కల్యాణం జరిపిన తర్వాత పార్వతీదేవికి మెట్టెలు, నల్లపూసలు సమర్పించే నాగవల్లి కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. నిత్యకల్యాణ మండపంలో సదస్యం తర్వా త ఉత్సవ మొదటిరోజు దేవతాహ్వానానికి ఆవిష్కరించిన ధ్వజావరోహణ కార్యక్రమం ఆధ్యంతం కనులపండువగా జరిపించారు.