శ్రీశైలం, ఫిబ్రవరి 18: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో శనివారం సాయంత్రం భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్ల ప్రభోత్సవం శోభాయమానంగా జరిగింది. పలు పుష్పాలతో అలంకరించిన ప్రభపై స్వామి, అమ్మవార్లను ఉంచి గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు ప్రభోత్సవం నిర్వహించారు. ప్రభ ఎదుట చేపట్టిన భక్తులు కోలాటం, చెక్కభజన, కళాకారుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నట్లు ఈవో లవన్న తెలిపారు.
నందివాహనంపై స్వామి, అమ్మవార్లు
ప్రభోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లు నందివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అక్కమహాదేవి అలంకార మండపంలో పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక వేదికపై భ్రామరీ సమేత మల్లికార్జునుడికి పూజలు చేసినట్లు ఈవో తెలిపారు.
పాగ చుట్టిన మల్లన్న
మహా శివరాత్రిని పురస్కరించుకొని మల్లన్నను వరుడిగా చేసే పాగాలంకరణ ఘట్టాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలొచ్చారు. పాగాలంకరణ, కల్యాణంలో పాల్గొనే వీఐపీ పాస్లతోపాటు సామాన్య భక్తులకు అవకాశం కలిగించామని చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి తెలిపారు. ఈవో లవన్న ఆధ్వర్యంలో 11మంది నిష్ణాతులైన వేదపండితులు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చనలు శాస్ర్తోక్తంగా జరిపారు. అనంతరం నాలుగు గంటలపాటు శ్రీశైల మల్లన్నకు వివిధ రకాల శుద్ధజలాలు, పండ్లరసాలతో అభిషేకించారు. జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి శిష్య బృందంతో మల్లన్నకు పూజ చేసుకునేందుకు వేదపండితులు వీలు కల్పించారు.
ఆదిదంపతుల లీలాకల్యాణం
లింగోద్భవం అనంతరం భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్ల లీలాకల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో స్వామి, అమ్మవార్లు పట్టువస్ర్తాలతో సర్వాలంకరణశోభితులై ఉండగా నాగులకట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ మండపంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ నయనానందకరంగా పెండ్లి జరిగింది.