అలంపూర్, ఫిబ్రవరి 17 : దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు శాస్ర్తోక్తంగా మొదలయ్యాయి. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు కొనసాగించారు. సాయంత్రం మృత్ సంగ్రహణంలో భాగంగా మట్టి లో నవధాన్యాలను ఉంచి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రం సకల సంపదలతో విరాజిల్లాలని, ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలనే ఆకాంక్షతో నవ ధాన్యాలను మొలకెత్తిస్తారు. ధ్వజస్తంభంపై అలంకరించిన నందీశ్వర జెండాను ఉత్సవాలు ముగిసే వర కు ఉంచనున్నారు. ఈవో పురేందర్కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ధర్మకర్తలు మద్దిలేటి, హరిబాబు, రాముడు, అర్చకులు, భక్తులు నందీశ్వర జెండా ఎగుర వేసి శివుడి ఆనతి మేరకు ఉత్సవాలను ప్రారంభించారు. ఉభయ ఆలయాలను రంగరంగుల విద్యుద్దీపాల కాంతులతో దేదీప్యమానంగా ముస్తాబు చేశారు.
ఎమ్మెల్యే అబ్రహం, ఆయన కుమారుడు అజయ్ పట్టు వస్ర్తాలు సమర్పించారు. వీరికి పూర్ణకుంభంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా శివనామస్మరణ మార్మోగిం ది. శివాలయంలోని సాక్షి గణపతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండలి ఆకట్టుకున్నది. శనివారం ఉదయం 5:30 గంటల నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. అర్ధరాత్రి శివస్వాములచే నిర్వహించే ఆకాశజ్యోతి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు ఆలయ ఆవరణలో జాగారం చేసేందుకు వీలుగా పుష్కరఘాట్ వద్ద ఉచిత నాటక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. భక్తుల సౌకర్యం కోసం చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూలైన్లు, ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన అర్చకుడు డిండిగల్ ఆనంద్ శర్మ, శ్రీకాంత్శర్మ, త్యాగరాజుశర్మ, విక్రాంత్ శర్మ, శ్యామ్కుమార్ శర్మ, కిట్టు స్వామి, ధనుంజయశర్మ పాల్గొన్నారు.