ఓం నమశివాయ.. హరహర మహాదేవ శంభో శంకర.. మహాదేవా నమోనమామి.. సర్వేశ్వరా సదా స్మరామి.. అంటూ శైవ క్షేత్రాలు మార్మోగాయి. శనివారం మహాశివరాత్రి పర్వదినాన ముక్కంటిని దర్శించుకొని భక్తులు పునీతులయ్యారు. లింగోద్భవ కాలంలో భోళాశంకరుడి దర్శనానికి పోటీపడ్డారు. దర్శనం కోసం గంటల తరబడి బారులుదీరారు. శివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆది దంపతుల వైభవాన్ని కనులారా ఆస్వాదించి ఆధ్యాత్మికానందం పొందారు. శ్రీశైల పుణ్యక్షేత్రం భక్తులు, శివ స్వాములతో కిక్కిరిసింది. నంది వాహనంపై భ్రామరి, మల్లికార్జునస్వామి విహరించారు. చెంచుల జాతరైన నల్లమలలోని భౌరాపూర్, అలంపూర్లో ఆది దంపతులు శివపార్వతుల కల్యాణం కమనీయంగా జరిగింది.
నెట్వర్క్ నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 18 : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి.. భక్తులు శివలింగాన్ని దర్శించుకొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ఆలయాల్లో వేదపండితులు శివపార్వతుల కల్యాణం నిర్వహించగా భక్తులు అధికసంఖ్యలో హాజరై తిలకించారు. ఆయా నియోజకవర్గాల్లోని ప్రసిద్ధ శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. మంత్రి శ్రీనివాస్గౌడ్ పాలమూరులోని వీరన్నపేట పెద్దశివాలయం, న్యూగంజ్లోని నీలకంఠేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఉపవాసాలు చేపట్టి స్వామిని మది నిండా కొలిచారు. ఆలయాల్లో జాగారం చేస్తూ స్వామివారి భజన కీర్తనలు ఆలపించారు. అదేవిధంగా పలు ఆలయాల్లో నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం, పండ్లు పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు.
పుల్లూరు ఆలయాల్లో ఎమ్మెల్సీ కవిత పూజలు
ఉండవెల్లి, ఫిబ్రవరి 18: మండలంలోని పుల్లూరులో ఉన్న సూర్యనారాయణస్వామి, హరిహర నారాయణస్వామి, శివాలయాల్లో ఎమ్మె ల్సీ కవిత శనివారం ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పండితులు ఎమ్మెల్సీకి తీర్థప్రసాదాలను అందజేశా రు. వీరి వెంట గద్వాల ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్ర హం, మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రాముడు తదితరులు ఉన్నారు.
వైభవోపేతంగా రుద్రాభిషేకం
హాజరైన శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు
మంత్రాలయం, ఫిబ్రవరి 18 : కర్నూల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాఘవేంద్రస్వామి మఠంలో పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు పరమశివుడికి రుద్రాభిషేకం వైభవోపేతంగా నిర్వహించారు. శనివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ శివుడికి పీఠాధిపతి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. పరమశివుడి కరుణాకటాక్షాలు దేశ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, పాడిపంటలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని పరమశివుడిని కోరుకున్నట్లు పీఠాధిపతి తెలిపారు. అంతకుముందు రాఘవేంద్రస్వామి మూల బృందావనం, మంచాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో శ్రీమఠం అధికారులు, పండితులు, వేదపాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.