నారాయణపేట, డిసెంబర్ 23: యాసంగి బియ్యం కొనుగోలు చేయాలని కేంద్రంలోని పెద్దల వద్దకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట తానుకూడా వెళ్లానని, తెలంగాణ యాసంగి బియ్యంలో నూకలు ఉంటాయి, మీ ప్రజలకు అలవాటు చేసి వారికి తినిపించాలని ఎగతాళిగా మాట్లాడిన బీజేపీ నాయకులకు రానున్న ఎన్నికల్లో నూకలు చెల్లిస్తామని, రైతులను చిన్నచూపు చూస్తే పిడికిలి బిగించి ఉరికించి కొడతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. ధర్నాకు నియోజకవర్గంలోని కోయిల్కొండ, మరికల్, ధన్వాడ, దామరగిద్ద, నారాయణపేట మండలాలతోపాటు నారాయణపేట పట్టణానికి చెందిన రైతులు, రైతుబంధు సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి నేటి వరకు ఇలాంటి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని తానెన్నడూ చూడలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి బడా వ్యాపారులకు సంబంధించి రూ.12లక్షల కోట్లను మాఫీ చేసిందిగానీ, రైతాంగానికి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే రైతులు బాగు పడుతారని గతంలో శాసనసభలో రెండుసార్లు ఆమోదించి కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు. 2014న నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తానని చెప్పారని, 2019 ఎన్నికల్లో నూ ఇదే వాగ్ధానం చేసి ఓట్లు దండుకొని నేడు రైతులకు మొండిచెయ్యి చూపించారన్నారు. ఊ అంటే పీఎం కిసాన్ ఇస్తున్నామని బీజేపీ నాయకులు చెబుతున్నారనికానీ, ఎంతమందికి ఇచ్చారన్న విషయాలను కూడా ప్రజల ముందు పెట్టాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క నారాయణపేట జిల్లాలో రూ.2018 కోట్ల రూపాయలను రైతుబంధు పథకం ద్వారా రైతుల అకౌంట్లలో జమ చేస్తే అదే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద కేవలం రూ.203 కోట్లను మాత్రమే రైతుల అకౌంట్లలో జమచేసిందన్నారు. దీన్ని బట్టి చూస్తే రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వం ఎదో ఇట్టే అర్థమవుతుందన్నారు.
బెంగాల్, తమిళనాడు, కర్నాటక ప్రాంత రైతులు కల్లాలు కట్టుకోవచ్చుకానీ, తెలంగాణ ప్రాంత రైతులు కల్లాలు కట్టుకుంటే కేంద్రానికి ఎందుకు మంట అని నిలదీశారు. కేసీఆర్ ఒక శక్తి అని, కేంద్రం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను దేశ వ్యాప్తంగా ఉన్న 6లక్షల 40వేల గ్రామాల ప్రజలను బీఆర్ఎస్ పార్టీ తరపున చైతన్య వంతం చేస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చిన ఆరు నెలల కాలంలోనే రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చిందని, అదే దేశంలో అధికారంలో వస్తే రెండు ఏండ్లలో దేశ వ్యాప్తంగా రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తానని తమ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేసిందని పక్కన కర్నాటకలోని జెడీఎస్ పార్టీ నాయకులు తమ పార్టీని ఆహ్వానిస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకం కింద రూ.151 కోట్ల వ్యయంతో చేపట్టిన కల్లాల డబ్బులను తిరిగి చెల్లించాలని కేంద్రం తాఖీదులు పంపించిందని, లేకపోతే రాష్ర్టానికి ఉపాధి హామీ పథకాన్ని నిలిపివేస్తామని చెబుతుందన్నారు. ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పంట పొలాల్లోనే వరిధాన్యం అరబెట్టేందుకు కల్లాల నిర్మాణానికి తెలంగాణ ప్రభు త్వం ప్రోత్సహిస్తే, కేంద్రం అడ్డుపడుతతుందన్నారు. బోర్ల దగ్గర మీ టర్లు పెట్టకుంటే అప్పు పుట్టనియ్యమని కేంద్రం బెదిరిస్తుందని, ఆఖరుకు 30వేల కోట్ల రూపాయలను నిలుపుదల చేసినా సీఎం కేసీఆర్ తెలంగాణలో బోర్ల దగ్గర కరెంటు మోటర్లు పెట్టనీయలేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90శాతం పూర్తయ్యిందని, కాల్వల తవ్వకాలు పూర్తి చేస్తే ప్రాజెక్టు పూర్తి అవుతుందని, కానీ ఇదే సమయంలో అనుమతులు లేకుండా చేపట్టారని రూ.900 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు.
కృష్ణానదిలో 811 టీఎంసీల మిగులు జలాల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాలు వాటాలు తేల్చాలని 8 సంవత్సరాలుగా నుంచి ఇరు రాష్ర్టాల సీఎంలు కోరుతుంటే కేంద్రం స్పందించడం లేదన్నారు. రాజేందర్రెడ్డి మాట ఇస్తే మాట తప్పడు ఈ విషయం నారాయణపేట నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు. ప్రాణం పోయినా పర్వాలేదు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టయినా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథ కం ద్వారా కృష్ణ జలాలను నారాయణపేటకు తీసుకొచ్చి రైతుల పాదాలు కడుగుతానని శపథం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మెన్ శాసం రామకృష్ణ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు భీమయ్యగౌడ్, డీసీఎంఎస్ డైరెక్టర్ పుట్టి ఈదప్ప, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయచంద్రకాంత్, వైస్ చైర్మన్ హరినారాయణభట్టడ్, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్, పీఏసీసీఎస్ చైర్మన్లు, రైతు బంధుసమితి సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డుసభ్యులు, బీఆర్ఎస్ మహిళ, యువత, సోషల్మీడియా విభాగం సభ్యులు, కోయిల్కొండ, మరికల్, ధన్వాడ, దామరగిద్ద, నారాయణపేట మండలాల అధ్యక్షులు కృష్ణయ్య, తిరుపతయ్య, వెంకట్రెడ్డి, ఆశన్న, వేపూరి రాములు, పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్, నాయకులు రాజవర్ధన్రెడ్డి, సుదర్శన్రెడ్డి, ప్రతాప్రెడ్డి, కన్నజగదీశ్, చెన్నారెడ్డి, శ్రీపాద్ పాల్గొన్నారు.