దేవరకద్ర-మునీరాబాద్ రైల్వే లైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.1,723 కోట్లతో నిర్మాణం చేపట్టి పాతికేళ్లయినా పట్టాలెక్కడం లేదు. దేవరకద్ర నుంచి 110 కి.మీ. లైన్లో ఇప్పటికే తెలంగాణలో 60 కిలోమీటర్లు, కర్ణాటకలో 40 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయి. ఇంకా మాగనూరు-కృష్ణ మధ్య 10 కి.మీ. అసంపూర్తిగా మిగలగా.. రైల్వేస్టేషన్లు నిరుపయోగంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం అసమర్థతతోనే పనుల్లో జాప్యం ఏర్పడుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. కాగా పాలమూరు-జక్లేర్ మధ్య రెండేండ్లుగా వారానికి రెండుసార్లు తిరిగిన రైలును సైతం అధికారులు నిలిపివేశారు. దీంతో రైలు ప్రయాణం కలగానే మిగిలిపోయిందని మక్తల్, మరికల్ వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరికల్, అక్టోబర్ 13 : మరికల్, మక్తల్ ప్రాంతాల మీదుగా చేపట్టిన రైల్వేలైన్ పనులు పాతికేైళ్లెనా ఇంకా పూర్తి కాలేదు. మహబూబ్నగర్-మునీరాబాద్ రైల్వేలైన్ పనులు నత్తనడకన కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని బట్టి బీజేపీ సర్కార్కు ఈ ప్రాంతంపై ఎంత చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో మహబూబ్నగర్-మునీరాబాద్ రైల్వేలైన్ పనులు చేపట్టారు. అయితే, పాతికేళ్లుగా దేవరకద్ర నుంచి మాగనూర్ వరకు మాత్రమే పనులు పూర్తయ్యాయి. జక్లేర్-మహబుబ్నగర్ మధ్య రెండేండ్లపాటు వారానికి రెండుసార్లు తిరిగిన రైలును ప్రస్తుతం నిలిపివేశారు. దీంతో రైల్వే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
రూ.కోట్లు ఖర్చు పెట్టి రైల్వేలైన్ ఏర్పాటు చేసినా.. కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వేలైన్పై నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నది. దేవరకద్ర నుంచి కర్ణాటక రాష్ట్రంలోని మునీరాబాద్ వరకు ఉన్న 110 కిలోమీటర్ల రైల్వేలైన్ను రూ.1,723 కోట్ల అంచనాతో 25 ఏండ్ల కిందట ప్రారంభించారు. కాగా, తెలంగాణలో దేవరకద్ర నుంచి కృష్ణ వరకు సుమారు 70 కిలోమీటర్ల రైల్వేలైన్కుగానూ ఇప్పటివరకు 60 కి.మీ. పనులు పూర్తయ్యాయి. కేవలం మాగనూరు నుంచి కృష్ణ వరకు ఉన్న పది కి.మీ. పనులు పూర్తి చేయడం లేదు. కర్ణాటకలో ఉన్న 40 కి.మీ. పనులను పూర్తి చేశారు.
దేవరకద్ర నుంచి మాగనూర్ వరకు రైల్వే అధికారులు ట్రయల్ రన్ను నిర్వహించినా.. ఇప్పటికీ రైలు ఎందుకు తిరగడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. దేవరకద్ర, మరికల్, జక్లేర్, మక్తల్, మాగనూర్, కృష్ణ వరకు రైల్వేస్టేషన్ పనులు పూర్తయ్యాయి. మార్చి 25, 2017న దేవరకద్ర నుంచి జక్లేర్ వరకు అధికారులు రైలును ప్రారంభించినా.. అది మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది.ఈ రైల్వేలైన్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తే హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లే ప్రయాణికులకు దూరం తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది.
రాష్ట్రంలో అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్న బీజేపీ నాయకులు మహబూబ్నగర్-మునీరాబాద్ రైల్వేలైన్ కోసం కేంద్రం వద్ద నోరెత్తడంలేదు. పీఎం లేదా కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి ఈ రైల్వేలైన్ గురించి ప్రస్తావన తీసుకురావడంలేదని, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల బీజేపీ నాయకుల తీరుపై ఆ పార్టీ కార్యకర్తలే దుమ్మెత్తిపోస్తున్నారు. అడ్డగోలు రాజకీయాలు చేయడం కాదు.. అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రజలు హెచ్చరిస్తున్నారు. పాతికేళ్లైనా పట్టాలకే పరిమితమైన మహబూబ్నగర్-మునీరాదాద్ పనులు ఇంకెన్నాళ్లకు పూర్తి చేస్తారో ఆ దేవుడికే తెలియాలి.
నారాయణపేట జిల్లా వాసులకు రైలు సౌకర్యం కలగానే మిగలనున్నది. ఈ ప్రాంతంపై బీజేపీ నాయకులకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. 25 ఏండ్లుగా పనులు నత్తనడక సాగుతున్నాయి. ఇప్పుడు కరోనా సాకుతో మళ్లీ పనులు నిలిపివేశారు. ఈ రైల్వేలైన్ పూర్తయితే రాయిచూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. గోవా, ముంబై తదిర ప్రాంతాలకు దూరం తగ్గుతుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి పనులు త్వరగా పూర్తిచేసి ప్రతిరోజూ రైలును నడపాలి.
– గౌని సురేఖారెడ్డి, జెడ్పీ వైస్చైర్పర్సన్, నారాయణపేట
బీజేపీ ప్రభుత్వం కులమత రాజకీయాలు చేయడం తప్పా అభివృద్ధిపై దృష్టి సారించడంలేదు. ఇందుకు మహబూబ్నగర్-మునీరాబాద్ రైల్వేలైనే నిదర్శనం. 25 ఏండ్లుగా 70 కిలోమీటర్ల పనులు చేపడుతూనే ఉన్నారంటే సిగ్గు వేస్తున్నది. రైల్వే అధికారులు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూస్తున్నది. అధికారులు ఇప్పటికైనా స్పందించి పనులు పూర్తి చేయాలి. ఎమ్మెల్యేలు రైల్వే అధికారులపై ఒత్తిడి తెస్తున్నా ఆధికారులు స్పందించకపోవడం తగదు.
– శ్రీకళరాజవర్ధన్రెడ్డి, ఎంపీపీ, మరికల్
హైదరాబాద్ నుంచి మాగనూర్ వరకు నిత్యం రెండు రైళ్లను నడపాలి. ఈ లైన్ పూర్తయితే హైదరాబాద్ వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది. రైల్వే అధికారులు స్పందించి నిత్యం రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలి. నారాయణపేట జిల్లా వాసులకు రైలు సౌకర్యం కల్పించేందుకు బీజేపీ ఎంపీలు, మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు.
– కస్పే గోవర్ధన్, సర్పంచ్, మరికల్