మహబూబ్నగర్, జూలై 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్న చిరుద్యోగులపై జీఎస్టీ పోటు పడుతున్నది. ప్రతి నెలా సంపాదించిన కొంతైనా జీఎస్టీ భారం పడి సామాన్యుల నడ్డి విరుస్తుంది. వ్యాపారులు అన్నిరకాల వస్తువులపై ముక్కుపిండి పన్ను వసూలు చేస్తున్నారు. దీంతో చిరుద్యోగుల జీవితాల్లో పొదుపు మాటే వినబడటం లేదు. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న చిరుద్యోగులు ఏ వస్తువు కొన్నా ప్రతిదానిపై అదనంగా జీఎస్టీని చెల్లిస్తున్నారు. అగ్గిపెట్టె నుంచి సబ్బుబిళ్ల, పప్పు దినుసులు ఏవి కొన్నా ఎమ్మార్పీపై అదనంగా జీఎస్టీ బాదుతున్నారు. దీంతో నెలకు సంపాదన పెరిగినా ధరల ప్రభావంతో చిల్లిగవ్వలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇంటికి చుట్టాలొస్తే భయపడే పరిస్థితి ఏర్పడింది. పట్టణాల్లో ఖర్చులు విపరీతం కావడంతో గ్రామాలతో బాం ధవ్యాలను దూరం చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. దీంతో చాలామంది చిరుద్యోగులు అదనంగా పార్ట్టైం జాబ్ చేస్తున్నారు. చివరికి భార్యాభర్తలు జాబ్కు వెళ్లాల్సి వస్తుంది. బయట తిరగాలన్నా జేబులో చిల్లిగవ్వ లేని పరిస్థితి. ఏ పని చేసినా నెలకు రూ.15 వేల నుంచి రూ.20వేలకు సంపాదిస్తున్నారు. దీంట్లో పెట్రోల్, టీ, టిఫిన్లు బయట చేయాల్సి వస్తుండగా.. ఇంటి కిరాయి సామాన్లకే సరిపోతుంది. పిల్లల స్కూల్ ఫీజులకు, ఇతరత్ర ఖర్చులకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని చిరుద్యోగులు వాపోతున్నారు.
అమాంతం పెరిగిన ధరలు
కేంద్రం విధించిన పన్నుల పుణ్యమా అన్నిరకాల వస్తువుల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దీనికి తోడు జీఎస్టీ అంటగట్టి వసూలు చేస్తున్నారు. పిల్లలకు చాక్లెట్లు తినిపించినా జీఎస్టీ బాదుడు తప్పడం లేదని మధ్యతరగతి జనం వాపోతున్నారు. ప్రతి వారం ధరలు అమాంతం పెంచుతున్నారు. తెలియకుండానే ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కేంద్రం పన్నుల భారం ఒకవైపు, మరోవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం అంటు వ్యాపారులు దోచుకుంటున్నారని సామాన్యులు మండిపడుతున్నారు.
అచ్చేదిన్ కాదు.. సచ్చేదిన్
కేంద్ర ప్రభుత్వం జీఏస్టీ పేరుతో ఇష్టానుసారంగా ధరలు పెంచడంతో ప్రధానమంత్రి చెబుతున్న అచ్చేదిన్ బదులు సామాన్యులు సచ్చేదిన్ వచ్చింది. ఈ దేశంలో గరీబులు పాలు, పెరుగు కూడా తినలేని దుస్థితి వచ్చింది. బీజేపీని నమ్మి ఓటేస్తే ప్రజల నడ్డి విరుస్తున్నారు.
– ఇమ్రాన్, తీలేరు, మరికల్ మండలం
ఇబ్బందులు పడుతున్నాం
కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వ స్తువులపై జీఎస్టీ పెంచడం వల్ల ని రుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం నిరుద్యోగులను ప్రోత్సహించకుండా జీఎస్టీ పెంచి పేదల నడ్డివిరుస్తున్నది. ఆరేండ్ల కిందట రూ.400 ఉన్న సిలిండర్ రూ.1150కి పెరగడంతో ఇబ్బందులు పడుతున్నాం.
– మనోహర్, నిరుద్యోగి, తాడూరు