రేషన్ కార్డులు రద్దయ్యాయా..? పరేషాన్ వద్దు..! అర్హత ఉంటే మళ్లీ కార్డులు మంజూరు చేయనున్నారు. 2016లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అనర్హుల కార్డులు తొలగించారు. అయితే, తొలగించిన కార్డుదారుల్లో ఇంకా అర్హులు ఉన్నారనే ఫిర్యాదులు వచ్చాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం పునర్విచారణ చేపట్టేందుకు సివిల్ సైప్లె అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, కార్డులు రద్దయిన లబ్ధిదారులు ఈనెల 20వ తేదీ వరకు రెవెన్యూ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. సదరు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రద్దయిన కార్డుదారులను గుర్తించి పునర్విచారణ చేయనున్నారు. ప్రభుత్వం త్వరలో కొత్త రేషన్కార్డులను మంజూరు చేయనుండడంపై అర్హులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్కర్నూల్, జూలై 15(నమస్తే తెలంగాణ): రేషన్కార్డు పేదలకు సంజీవని. కడుపు నింపుకొనేందుకు చౌకధర దుకాణాల్లో బియ్యం తెచ్చుకొనేందుకు, తమ పిల్లలను చదివించుకునేందుకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు, అనారోగ్యం వస్తే ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకొనేందుకు.. ఇలా ఎన్నో రకాలుగా పేదలకు రేషన్కార్డు ప్రయోజనకారిగా మారింది. పేదల కుటుంబాల్లో ఈ కార్డు ఓ సభ్యుడిలా మారింది. అలాంటి రేషన్ కార్డుల కోసం పేదలు చాలామంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా కొత్తగా పళ్లైన జంటలతోపాటు వివిధ కారణాలతో పేర్లు తొలగించబడిన, పుట్టిన పిల్లల పేర్లను చేర్పించేందుకు ఆరాటంతో ఉన్నారు. ఈ క్రమంలో త్వరలో కొత్తగా కార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇదే విషయాన్ని ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ సైతం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గతంలో సాంకేతిక తప్పిదాలతో కొందరి కార్డులు తొలగించబడ్డాయి. 2016లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలో అనర్హుల కార్డుల తొలగించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆధార్ సంఖ్య రెండుసార్లు నమోదై ఉంటే, గ్రామంలో పూర్తిగా లేకుండా వెళ్లిపోయిన, నిబంధనలకు విరుద్ధంగా భూములు కలిగి ఉండటం, మృతి చెందడంలాంటి కారణాలతో రేషన్కార్డులను రద్దు చేశారు. అయితే ఇందులో అత్యధికంగా మృతిచెందిన లబ్ధిదారులవే ఉన్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. అయితే అర్హులు ఉన్నారనే ఫిర్యాదులతో అన్యాయం జరగకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్డు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం పునర్విచారణ చేపట్టేందుకు సివిల్ సప్లయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీని ఆధారంగా అధికారులు పునర్విచారణ చేపట్టనున్నారు. కార్డులు రద్దయిన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని ఆ శాఖ కోరుతున్నది.
20వరకు దరఖాస్తుల ఆహ్వానం
ఈ నెల 20వ తేదీ వరకు రెవెన్యూ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తుల్లో అర్హులని తేలితే కార్డులను పునరుద్ధరించనున్నారు. అర్హులకు రేషన్కార్డు దక్కాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. రేషన్కార్డు ద్వారా పలు ప్రభుత్వ పథకాలకు, దవాఖానల్లో చికిత్సలకు చాలామంది దూరమవుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రెవెన్యూ అధికారులచే ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ పునర్విచారణతో తొలగించబడిన కార్డుదారుల్లో అర్హులకు ఇక న్యాయం జరగనున్నది. దీనికోసం రద్దయిన రేషన్కార్డుదారుల వివరాలను అధికారులు రేషన్షాపుల నుంచి సేకరిస్తున్నారు. ఆ జాబితాలను రేషన్ షాపులతో పాటుగా పంచాయతీల్లో ప్రదర్శిస్తారు. ఎవరైనా గుర్తించలేని కార్డుదారులుంటే కార్డులో ఉన్న చిరునామాకు పోస్టు లేదా ఫోన్ ద్వారా సమాచారం అందించడం జరుగుతుంది. ఇక మీడియాలోనూ ప్రచారం చేపట్టనున్నారు. రేషన్కార్డు తొలగించబడితే అందుకు కారణాలను నమోదు చేయాలి. అర్హులుంటే ఆ వివరాలను కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. ఇలా అధికారులు తొలగించబడిన కార్డుల పునర్విచారణ చేప్టటనుండటం చాలా మంది పేదల్లో ఆనందాన్ని నింపుతున్నది. నాగర్కర్నూల్ జిల్లాలో 2,15,208 తెల్ల రేషన్ కార్డులు, 18,680అంత్యోదయ, 40అన్నపూర్ణకార్డులు ఉన్నాయి. ఇందులో దాదాపుగా 9వేల వరకు కార్డులను గతంలో తొలగించడం జరిగింది.
ఈ నెల 20వరకు దరఖాస్తులు, విచారణ
జిల్లాలో ఇంతకుముందు 9వేల వరకు కార్డులను రద్దు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో కార్డుదారులకు నోటీసులు జారీ చేస్తున్నాం. ఈ నెల 20వ తేదీవరకు దరఖాస్తులు స్వీకరించి కార్డులు తొలగించడంలో తప్పులు దొర్లితే వెంటనే కార్డులు జారీ చేయడం జరుగుతుంది. తొలగించడానికి గల కారణాలనూ నివేదిస్తాం. జిల్లాలో ఎక్కడైనా ఇప్పటికే తొలగించబడిన కార్డుదారులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలి. తొలగించబడిన కార్డుదారుల ఇంటింటికీ వెళ్లి రెవెన్యూ శాఖ సర్వే చేపట్టడం జరుగుతుంది.
– మోహన్బాబు, సివిల్ సప్లయి అధికారి, నాగర్కర్నూల్ జిల్లా