కొల్లాపూర్, జూలై 1: రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంచేందుకు ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఏడు విడుతల్లో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. ఎనిమిదో విడుతలో మొక్కలు నాటేందుకు అధికార యంత్రాంగం సన్నధ్దమవుతున్నది. ఈ మేరకు నాగర్కర్నూల్ జిల్లాలోని 461గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో విరివిగా మొక్కలను సిద్ధం చేస్తున్నారు. వర్షాలు ఆశించినంతగా లేకపోవడంతో ఎనిమిదో విడుతలో హరితహారం కార్యక్రమం ఇంకా లాంఛనంగా షురూ కాలేదు. ఈ ఏడాది కూడా ఆయా ప్రాంతాల్లో నాటే మొక్కలపై అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఎనిమిదో విడుతలో హరితహారం కోసం జిల్లాలోని 461నర్సరీల్లో 95లక్షలు మొక్కలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నది. హరిత తెలంగాణ సాధననే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా ఏటా వానకాలంలో హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఇందుకోసం స్థానిక సంస్థల బడ్జెట్లో 10శాతం నిధులు కేటాయిస్తున్నది. త్వరలో జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి జిల్లాని 20మండలాల వారీగా కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం మొక్కలను నర్సరీల్లో పెంచి, నాటించే బాధ్యత డీఆర్డీవో, మున్సిపాలిటీలు, అటవీశాఖ, ఎక్సైజ్ శాఖలకు అప్పగించారు. ఈ మేరకు జిల్లాలోని 461 నర్సరీల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
మొక్కల రక్షణకు ప్రత్యేక చర్యలు
ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా నాటే మొక్కల్లో 85శాతం బతికేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రభుత్వం ఈ నిబంధనలు అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్లు, ట్యాంకర్లు అందించింది. వీటితో ఏడాది పాటు మొక్కలకు నీళ్లు పడుతున్నారు. నర్సరీల నుంచి మొక్కలు సరఫరా చేస్తుండగా అడవులు, రహదారులు, గ్రామపంచాయతీలు, పాఠశాలల మైదానాలు, అర్అండ్బీ, పంచాయతీరాజ్ రహదారులకు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
కలెక్టర్ ప్రత్యేక దృష్టి
జిల్లాలో హరితహారం మొక్కలు నాటి సంరక్షణ చర్యలపై క లెక్టర్ ఉదయకుమార్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. హ రితహారం కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా చేపట్టేందుకు ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశా లు నిర్వహిస్తున్నారు. కాలువగట్లు, చెరువు, కుంటల శిఖాల్లో, గట్లపై మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు.
పంపిణీకి మొక్కలు సిద్ధం
నాగర్కర్నూల్ జిల్లాలో 461గ్రామపంచాయతీలుండగా, ప్రతీ జీపీలోనూ నర్సరీ ఉంది. ప్రతి ఇంటికీ పూలు, పండ్ల ఆరు మొక్కలను పంపిణీ చేయనున్నారు. గతేడాది జిల్లాలో 41లక్షలు లక్ష్యంగా ఉండగా ఈసారి 95లక్షలు మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు ప్రతి మండలంలో నాలుగు బృహత్ పల్లె ప్రకృతివనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఐదెకరాల్లో ప్రకృతివనం ఏర్పాటు చేస్తారు. ప్రతి వనంలో 15వేల వివిధ రకాల పండ్లు, నీడనిచ్చే మొక్కలు నాటనున్నారు.
పూలు, పండ్ల మొక్కలు
జిల్లాలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే జిల్లా టార్గెట్ కోటీ 21లక్షలు హరితహారం మొక్కలు నాటేందుకు లక్ష్యం కాగా ఇందుకుగానూ కోటీ 21లక్షలు గుంతలు తీయాల్సి ఉండగా 39లక్షల గుంతలు తీశారు. ప్రసుత్తం అందుబాటులో 95లక్షల మొక్కలు ఉండగా జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 15లక్షలు మొక్కలు నాటినట్లు డీఆర్డీఏ అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి. హరితహారంలో నాటే కాగితం పూలు, సీమతంగేడు, టెకోమా, రణపాల, కానుగ, టేకు, చింత, ఉసిరి, సీతాఫలం, జామ, నేరేడు, మందార, క్రోటోపాం మొక్కలను ఇండ్ల వద్ద, రహదారుల వెంట నాటనున్నారు.
మండలాల వారీగా..
ఉప్పునుంతల మండలంలో 5లక్షల78వేలు, కోడేరు మండలంలో 4లక్షల71వేలు, అమ్రాబాద్ మండలంలో 4లక్షల55వేలు, పెద్దకొత్తపల్లి మండలంలో 5లక్షల56వేలు, అచ్చంపేట మండలంలో 8,81,100, బల్మూర్ 5లక్షల6వేలు, కొల్లాపూర్ 3,45,160, నాగర్కర్నూల్ 4లక్షల21వేలు, తెల్కపల్లి 6లక్షల52వేలు, వంగూరు 6లక్షల 22వేలు, ఉర్కొండ 3లక్షల 43వేలు, పదర 2లక్షల 19వేలు, తాడూరు 5లక్షల25వేలు, చారకొండ 3లక్షల 98వేలు, బిజినేపల్లి 7లక్షల43వేలు, పెంట్లవెల్లి 2లక్షల 12,600, తిమ్మాజిపేట 5,93,500, లింగాల 5లక్షల4వేలు, కల్వకుర్తి మండలంలో 5లక్షల 9వేలు మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.