ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి మంద జగన్నాథం
అయిజ, జూలై 1: అలంపూర్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి మంద జగన్నాథం పేర్కొన్నారు. పట్టణంలోని మేడికొండ రోడ్డులోని టీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీటీసీ ప్రహ్లాదరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంద జగన్నాథం పాల్గొని మాట్లాడారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో రెండు జీవనదులు ప్రవహిస్తున్నాయని, నదులతోపాటు సారవంతమైన భూములు ఉండటం నడిగడ్డ ప్రజలు, రైతులు చేసుకున్న పుణ్యమన్నారు. పరిశ్రమలు స్థాపిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తో చర్చించి జిల్లా అభివృద్ధికి ప్రత్యక చొరవ తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధే ధ్యేయంగా అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మంద జగన్నాథంను నాయకులు, కార్యకర్తలు సన్మానించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీపీ నాగేశ్వర్రెడ్డి, అలంపూర్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి మంద శ్రీనాథ్, వడ్డేపల్లి శ్రీనివాసులు, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య, మాజీ జెడ్పీటీసీ చిన్న హన్మంతు, రవిరెడ్డి పాల్గొన్నారు.
మంద జగన్నాథంకు మంత్రి సన్మానం
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధిగా నియమితులైన మాజీ ఎంపీ మంద జగన్నాథంను శుక్రవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి మంద జగన్నాథంను సన్మానించారు.
బీచుపల్లి అంజన్నకు పూజలు
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధిగా నియమితులైనందున మంద జగన్నాథం శుక్రవారం బీచుపల్లి అంజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సందీపాచారి, వాల్మీకి పూజారులు స్వామివారికి పూజలు చేసి మంద జగన్నాథంకు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ఈవో రామన్గౌడ్ స్వామివారి శేషవస్త్రంతో సన్మానించారు. ఆయన వెంట టీఆర్ఎస్ అలంపూర్ నియోజకవర్గ ఇన్చార్జి మంద శ్రీనాథ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జయచంద్రారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, రామిరెడ్డి, గిడ్డారెడ్డి, అంజి, ఏకాంత్, రఘు తదితరులు పాల్గొన్నారు.