కల్వకుర్తి, జూన్ 30 : రాష్ర్టానికి పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు..పోతుంటారు వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ర్టాభివృద్ధిలో పొలిటికల్ టూరిస్టుల పాత్ర శూన్యమని, రెండు రోజలుపాటు లొల్లి పెడుతూ అబద్దాలు వల్లె వేస్తూ ఎక్కడ నుంచి వచ్చారో అక్కడికి వెళ్లిపోతారని బీజేపీ జాతీయ నేతలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
మాజీ సర్పంచ్ ఆనంద్కుమార్ నేతృత్వంలో గురువారం కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కల్వకుర్తి మున్సిపాలిటీకి చెందిన ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని టీఆర్ఎస్ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలనకు, మోడీ పరిపాలనకు బేరిజూ వేసుకోవాలన్నారు. ఎనిమిదేండ్లలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి మొండి చేయి చూపించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వంద మంచి పనులు చెబుతాం, రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక మంచి పని చెప్పాలని మంత్రి బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. కేంద్రం ప్రకటించిన టాప్ 20 గ్రామాల్లో 19 గ్రామాలు తెలంగాణ రాష్ర్టానికి చెందినవేనని, మరి మోడీ చేసిన అభివృద్ధి ఎక్కడున్నదని మంత్రి ప్రశ్నించారు.
గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన మోడీ ఇప్పుడు సిలిండర్ ధర రూ.1,050కి చేరిందని దీనికి ప్రధాని జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలనలో రూపాయి విలువ రోజు రోజుకు దిగజారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని, యువతకు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించిన హామీలు ఏమయ్యాయని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
గ్రామాలకు వచ్చే బీజేపీ నాయకులపై తెలంగాణలో అమలు అవుతున్న అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రశ్నల వర్షం కురిపించాలని టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి టీఆర్ఎస్ బలోపేతంగా ఉందని, టీఆర్ఎస్ను ఢీకొట్టే పార్టీ తెలంగాణలో లేదని మంత్రి పేర్కొన్నారు. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాష్ట్ర సమితి అని మంత్రి వివరించారు.
పార్టీ అనేది ప్రవాహం లాంటిదని, కొత్త, పాత నీరుతో చెరువు కళకళలాడుతున్నట్లు, పార్టీలో చేరిన కొత్త , పాత వారితో పార్టీ మరింత బలోపేతంగా మారుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, మెతుకు ఆనంద్, దివాకర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోళి శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, జెడ్పీటీసీ సభ్యులు విజితారెడ్డి, భరత్ప్రసాద్, భూపతిరెడ్డి. రమణారెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.