పెద్దమందడి, జూన్ 30 : టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వ నపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని మనిగిల్ల గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికులు కథనం మేరకు..మనిగిల్ల గ్రామానికి చెందిన వడ్డె ఉషన్న, పార్వతమ్మ కుమార్తె సంధ్య అదే గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసింది. గురువారం విడుదలైన ఫలితాల్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో 2 మార్కులు తక్కువ రావడంతో ఫెయిలయ్యింది. ఫలితాలు చూసుకున్న విద్యార్థిని సంధ్య మనస్తాపంతో ఇంట్లో ఎవ్వరూ లేని సమమంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, జూన్ 30 : పదోతరగతి పాస్ కాలేదని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాలానగర్ మండలం నందారంలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. నందారం గ్రామానికి చెందిన సిద్ధార్థ్(15) బాలానగర్ బాలుర ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదివి వార్షిక పరీక్షలు రాశాడు. గురువారం వెలువడిన పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో వ్యవసాయ పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై ఎస్సై జయప్రసాద్ను వివరణ కోరగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.