నాగర్కర్నూల్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి అర్హతతో నిర్వహించిన పాలీసెట్ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లా కేంద్రాల పరిధిలోని 44 సెంటర్లలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహించారు. బుధవారం నాటికే గుర్తించిన పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వైద్యశాఖ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. విద్యార్థులు పరీక్షలకు ఉదయం 10గంటల నుంచే హాజరయ్యారు. దీంతో జిల్లా కేంద్రాలతోపాటుగా పరీక్షా కేంద్రాల పరిసరాలు విద్యార్థులతో కిటకిటలాడాయి.
పాలీసెట్ పరీక్ష ఏప్రిల్లో జరగాల్సి ఉండగా పదో తరగతి పరీక్షలు జాప్యం కావడంతో ఆలస్యంగా నిర్వహించారు. రెండు వారాల్లో ఫలితాలు వచ్చే అవకాశముంది. జిల్లాల వారీగా చూస్తే మహబూబ్నగర్లో అత్యధికంగా 3,239మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రతి జిల్లాలోను 95శాతానికిపైగా విద్యార్థులు హాజరవడం విశేషం. పరీక్షలను కో ఆర్డినేటర్లు, పరిశీలకులు పర్యవేక్షించారు. కేంద్రాల వద్దకు చేరుకొని తనిఖీలు చేశారు. కేంద్రాల వద్ద 144సెక్షన్ విధించి పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లా పేరు : సెంటర్లు : మొత్తం విద్యార్థులు : హాజరు
మహబూబ్నగర్ : 9 : 3,526 : 3,239
నాగర్కర్నూల్ : 13 : 2,950 : 2,776
వనపర్తి : 11 : 2,523 : 2,377
జోగుళాంబ గద్వాల : 5 : 1,882 : 1,745
నారాయణపేట : 6 : 935 : 881