హన్వాడ, జూన్ 28: గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చేయాలని సంబంధిత అధికారులకు కమీషన్లు ఇచ్చినా కార్యాలయాల చుట్టూ తిప్పుకొని బిల్లులు చేయడం లేదని ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు పెద్దచెన్నయ్య మండల సర్వసభ్య సమావేశంలో పేర్కొన్నారు. అదేవిధంగా ఆయా గ్రామాల సర్పంచులు కూడా తమ గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని మండల అధికారులు చర్యలు తీసుకోవాలని సభకు వివరించారు.
మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ బాలరాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా నిర్వహించడం లేదని, పర్యవేక్షించాలని సర్పంచులు శ్రీదేవి, వెంకన్న, సరస్వతీ, శంకర్ కోరారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లోని పలు సమస్యలు సభ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు అన్వర్, జెడ్పీటీసీ విజయనిర్మల, వైస్ ఎంపీపీ లక్ష్మి, ఎంపీడీవో ధనుంజయగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజుయాదవ్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఈవోపీఆర్డీ వెంకట్రెడ్డి, కోఆప్షన్ మండల సభ్యుడు మన్నాన్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.