మహబూబ్నగర్, జూన్ 28: జిల్లాలోని రైతులు వానకాలం-2022కు సంబంధించి రైతుబంధు నగదును ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైతులు ఈ నెల 22వ తేదీ నాటికి పట్టాదారు పాసుబుక్ పొందిన వారు తమ క్లస్టర్కు సంబంధించిన ఏఈవోకు నూతన పాసుపుస్తకం, ఆధార్కార్డు, బ్యాంక్ఖాతా జిరాక్స్లను అందించాలన్నారు. జూలై 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 12,441మంది రైతులు కొత్తగా పాసుపుస్తకాలను పొందినట్లు తెలిపారు. ఇటీవల వాట్సాప్ గ్రూప్లో రైతులకు గుడ్న్యూస్, సగం ధరకే ట్రాక్టర్లు అని, పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన పథకం కింద ఇస్తున్నారనే ప్రచారం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి సూచనలు, ప్రతిపాదనలు జిల్లాకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి అందలేదని తెలిపారు.
అధిక సాంద్రత పద్ధతిలో పత్తిసాగు మేలు
బాలానగర్, జూన్ 28: అధిక సాంద్రత పద్ధతిలో పత్తిసాగు చేస్తే 30శాతం ఎక్కువ దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్ అన్నారు. మండలంలోని మొదంపల్లిలో ఓ రైతు పొలంలో మంగళవారం అధిక సాంద్రత పద్ధతిలో పత్తి విత్తనాలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకరాకు 25వేల మొక్కలు ఉండాలని, అధిక సాంద్రత పత్తి సాగుకు(80.20సెం.మీ. ఎడంలో) ఎకరాకు సుమారుగా 2.5కిలోల విత్తనాలు అవసరమన్నారు. కార్యక్రమంలో ఏడీఏ ఆంజనేయములు, ఏవో ప్రశాంత్రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు కంది విత్తనాలు పంపిణీ
జడ్చర్ల, జూన్ 28: మండలంలోని మల్లెబోయిన్పల్లి రైతువేదికలో మంగళవారం రైతులకు వానకాలం సాగుపై ఏవో గోపినాథ్ అవగాహన కల్పించారు. ఎన్ఎఫ్ఎస్ఎం పథకంలో భాగంగా రైతులకు ఉచితంగా కంది విత్తనాల కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు. రైతులు వెదజల్లే పద్ధతిలో వరి సాగుచేసి ఖర్చులు తగ్గించుకోవాలన్నారు. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులు వాడటం వల్ల భూసారం పెరిగి ఎరువుల వినియోగం తగ్గుతుందని సూచించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ మల్లేశ్, మాజీ చైర్మన్ దశరథరెడ్డి, ఏఈవో నవనీత, రైతుబంధు కోఆర్డినేటర్ మొగులయ్య, రైతులు మహిపాల్రెడ్డి, ఆంజనేయులు, వెంకటయ్య, అంజి తదితరులు పాల్గొన్నారు.