నారాయణపేట, జూన్ 25 : నీళ్లు తాగి పాడేసిన బాటిళ్లు ఎందుకు పనికిరావని అందరం పారేస్తుంటాం. కాని అవే పారేసిన బాటిళ్లు పనికొచ్చే విధంగా సరికొత్త ఐడియాతో ఏకంగా కళాశాల ప్రహరీ నిర్మించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల ప్రహరీని ప్లాస్టిక్ గాజు బాటిళ్లతో నిర్మించారు. ఇది అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నది. వినడానికి ఇది వింతగా ఉన్నా…చూడడానికి ఎంతో ఆకర్షనీయంగా ఉంది. మహిళా సభ్యురాలు క్లీన్ ఎన్విరాన్స్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్మించారు. హైదరాబాద్కు చెందిన క్లీన్ ఎన్విరాన్స్ అనే స్వచ్ఛంద సంస్థను 2017లో పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా స్థాపించారు. అనేక ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నారు. వీరి సేవలను గుర్తించిన నారాయణపేట కలెక్టర్ దాసరి హరిచందన పేట జిల్లాలో సైతం పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త ఆలోచనలతో కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.
ఈమేరకు జిల్లా కేంద్రంలో వ్యర్థ బాటిళ్లతో ప్రహరీ నిర్మించాలని నిర్వాహకురాలు పద్మిని నిర్ణయించారు. శ్రీకారం చుట్టారు. ప్లాస్టిక్, గాజు సీసాలతో ఎక్కడ గోడ నిర్మించాలని ఆలోచించగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఓ వైపు ప్రహరీ లేని విషయాన్ని గుర్తించి అక్కడ నిర్మిస్తే బావుంటుందని భావించి శ్రీకారం చుట్టారు. ప్రహరీ నిర్మాణానికి అవసరమైన వాడి పారేసిన 40వేల ప్లాస్టిక్, 2వేల గాజు సీసాలను సేకరించారు. గోడ నిర్మాణంలో పూర్తిగా మహిళలనే పనిలో పెట్టుకున్నారు. రూ.7లక్షల వ్యయంతో నెల రోజుల్లో వంద మీటర్ల ప్రహరీ నిర్మించారు. సాధారణంగా సిమెంట్ గోడ నిర్మాణంతో పోలిస్తే 30శాతం డబ్బులు ఆదా అవుతున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లను పొడిగా చేసి గాజు బాటిళ్లల్లో నింపుతారు. అయితే గోడ నిర్మించడమే కాకుండా వాటికి వివిధ కలర్లతో రంగులు అద్ది చూడముచ్చటగా అలంకరించారు.
కాలుష్యాన్ని అరికట్టవచ్చు
ప్రతిరోజు వందల, వేల సంఖ్యలో ప్లాస్టిక్, గాజు బాటిళ్లను తాగి పారేస్తుంటారు. ఇలా విసిరేసిన బాటిళ్లు డ్రైనేజీ కాలువలకు అడ్డుపడడం వలన మురుగు నీరు నిలిచిపోయి అంటురోగాలు ప్రభలే అవకాశాలు ఉన్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లను కాల్చడం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని బాటిళ్లతో ప్రహరీని నిర్మించారు. కేవలం ప్రహరీ గోడనే కాకుండా ఇల్లు, గోదాములు కూడా కట్టుకోవచ్చు. సిమెంట్ పనులతో పోలిస్తే 30శాతం మేరకు డబ్బులు మిగులుతాయి. పైగా ఇవి ఎంతో దృఢంగా ఉంటాయి.
– పద్మిని, క్లీన్ ఎన్విరాన్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు