వనపర్తి, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన పవన్కుమార్రెడ్డి, శిల్ప దంపతుల కుమార్తె చైత్రారెడ్డి. పట్టణంలోని స్వర్ణముఖి ఆర్ట్స్ అకాడమీ గురువు వంగీపురం నీరజాదేవి వద్ద నాట్య పాఠశాలలో నృత్యం నేర్చుకుని పలువురి ప్రశంసలు పొందుతున్నది. 2012లో తిరుపతిలో నిర్వహించిన ప్రపంచ మహాసభలలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆకట్టుకుని మొదటి స్థానంలో నిలిచింది.
ఆరేండ్ల చిరు ప్రాయం నుంచే..
ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్న ఈ అమ్మాయి ఆరేండ్ల ప్రాయంలోనే కూచిపూడి నృత్యంపై ఆసక్తి పెంచుకున్నది. అంతే సాధన చేసింది. శ్రద్ధతో కూచిపూడి గురువు నీరజాదేవి వద్ద శిష్యరికం చేసింది. మెళకువలు నేర్చుకుని స్థానికంగా ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నృత్య ప్రదర్శనలిస్తూ శభాష్ అనిపించుకుంటున్నది. చాలా సంవత్సరాలు తర్ఫీదు పొందింది. నృత్య కళాభినయాన్ని చూసి అమెరికాకు చెందిన వైజయంతి ఇండియాకు వచ్చిన సందర్భంగా చైత్రారెడ్డికి సింహనందిని నృత్యం నేర్పించారు.
నాట్యం చేస్తూనే సింహం చిత్రాన్ని వేయడమే ఈ కళ.. ఇది అరుదైన, అద్భుతమైన కళ. చిత్రారెడ్డి గురించి తెలుసుకుని ఫోన్ నెంబర్ తీసుకుని వచ్చి మరీ నేర్పి అమెరికాకు వెళ్లిపోయింది. ప్రస్తుతం మూడేండ్లుగా యామిని యశోద వద్ద ఆమె కూచిపూడి నృత్యం శిక్షణ తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ స్కాలర్షిప్ను అందుకుంటున్నది. కరోనా కారణంతోపాటు ఇంటర్మీడియట్ చదువు కోసం కొంత సమయం కేటాయిస్తుండటంతో అంతర్జాతీయ అవకాశాలను వదులుకుంటున్నది.
ప్రశంసల జల్లు
చైత్రారెడ్డి నాట్యానికి ముగ్ధులైన అనేకమంది కళాకారులు, ప్రముఖులు ఆశీర్వదించి అభినందించారు. నాట్యాంకురం అవార్డును వేంపటి చిన్న సత్యం జయంతి రోజున హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో కూచిపూడి నృత్య నాట్యాచార్యులు, తెలుగు యూనివర్శిటీ ప్రొఫెసర్ జొన్నలగడ్డ అనురాధ, పశుపతి శేషుబాబు చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. సిరిమువ్వ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ కే.విశ్వనాథ్ చేతులమీదుగా పలు అవార్డులు అందుకున్నారు.
హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఎల్లార్ వెంకటేశ్వర్రావు అభినందనలు గుప్పించారు. జూనియర్ హేమామాలిగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు రమణాచారి అభివర్ణించారు. మంత్రులు నిరంజన్రెడ్డి, మహమూద్అలీ, స్వర్గీయ నాయిని నరసింహారెడ్డి, గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రముఖ నృత్య కళాకారిణి శోభానాయుడు.. ఇలా ఎందరో చైత్రారెడ్డి నృత్యాన్ని మెచ్చుకున్నారు. అప్పటి జిల్లా కలెక్టర్లు గిరిజాశంకర్, శ్వేతామహంతి, షేక్యాస్మిన్ బాషా నృత్యానికి ముగ్ధులై ప్రోత్సహించారు. సిలికానాంధ్ర ప్రదర్శనలో భాగంగా మూడుసార్లు ఇచ్చిన ప్రదర్శనలకు మూడుసార్లు గిన్నిస్ రికార్డు అందుకున్నది.
డాక్టర్ కావాలన్నది నా కల
డాక్టర్ కావాలన్నదే నాకల. అందుకు ఇంటర్మీడియట్ శ్రద్ధగా చదువుతున్నాను. వైద్యురాలినై రోగులకు సేవ చేయాలి. అయినా నృత్యాన్ని మాత్రం విడవను. నేను ఇష్టపడ్డ కళ కూచిపూడి. మా అమ్మానాన్నల ప్రోత్సాహం, గురువులు చెప్పిన పాఠాలు నన్ను నృత్యకారిణిగా నిలబెట్టాయి. గురువు నీరజాదేవికి రుణపడి ఉంటాను. వైజయంతి, ప్రస్తుత గురువు యామని యశోదకు కృతజ్ఞతలు. వారు లేకుంటే నాకీ గుర్తింపు వచ్చేది కాదు.
– చైత్రారెడ్డి, కూచిపూడి నృత్య కళాకారిణి
అవార్డులు