తిమ్మాజిపేట, జూన్ 25: ఆ బాలుడిది నిరుపేద కుటుంబం. తండ్రి గొర్రెల కాపరి. తండ్రి వెంట కాలక్షేపం కోసం వెళ్లిన అతడిని విధి వక్రించింది. అనుకోని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం తప్పినా కాలును తీసేయాల్సి వచ్చింది. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన మధు స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. గత సంవత్సరం కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూసిన సమయంలో తండ్రి బాలయ్య వెంట గొర్రెలను కాసేందుకు సమీపంలోని అడవి(గుట్టలు)కి వెళ్లాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అడవిపందుల కోసం డైనమెట్ పెట్టగా, ప్రమాదవశాత్తు దానిమీద కాలు పెట్టడంతో పేలి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స అందించగా కాలుకు తీవ్ర గాయాలు కావడంతో కిందభాగం వరకు కాలిని తొలగించారు.
అప్పటిదాకా ఆటాపాటలతో గడిపిన బాలుడు ఒక్కసారిగా ఇంటికే పరిమితమయ్యాడు. చదువు కూడా మధ్యంతరంగానే నిలిచిపోయింది. కృత్రిమ కాలుకోసం వైద్యులను సంప్రదించగా రూ.75వేలకు పైగా ఖర్చు అవుతుందన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో అంతడబ్బు లేక మధు తల్లితండ్రులు మిన్నకుండిపోయారు. దాతలు సహకరించి కృత్రిమ కాలు ఏర్పాటుకు సహకరిస్తే బిడ్డ చదువు కొనసాగుతుందని వేడుకుంటున్నారు.