మహబూబ్నగర్, జూన్ 23 : తొలకరి పలకరింపుతో పంట పొలాల్లో పనులు ప్రారంభమయ్యాయి. ఆరుతడి పంటలను సాగు చేయాలని ఇప్పటికే సర్కార్ రైతులకు సూచించింది. సాగు ప్రతి రైతు బాగుకు అంటూ వ్యవసాయ అధికారులు రైతుల చేరి అవగాహన కల్పిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 4,77,202 ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా ఉందని వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఆరుతడి పంటలను మరింత విస్తరింపజేస్తూ రైతుకు లాభం చేకూరేందుకు అంచనాలను రూపొందించారు.
పెరిగిన సాగు విస్తరణ…
మహబూబ్నగర్ జిల్లాలో గతేడాది వానకాలం సాగు 3,26,567 ఎకరాలు ఉండగా ప్రస్తుతం 1,50,635 ఎకరాలు పెరిగి 4,77,202 ఎకరాల్లో పంటలను సాగు చేసేందుకు రైతన్నలు సిద్ధంగా ఉన్నారు.
సాగు ఇలా..
వానకాలంలో రైతులు పంటలను పండించేందుకు మరింత ఆసక్తికనబర్చుతున్నారు. బీడు భూములకు సైతం సాగునీరు తాకడంతో ఏండ్ల తరబడి పంటలను చేయని భూములకు సైతం సాగు చేసేందుకు రైతన్న తమ పొల్లాలో బీజీగా గడుపుతున్నారు. వరి 58,288 ఎకరాలు, కందులు 1,16,215, ఆముదాలు 17,245, జొన్నలు 44934.27, మొక్కజొన్న 40638, గ్రీన్గ్రాం 381.29, బ్లాక్గ్రామ్ 57.3, ఉలవలు 810, పత్తి 1,78,609, పల్లీ 397, ఇతర పంటలు 19383ఎకరాల్లో సాగు చేస్తునట్లు అధికారులు చెబుతున్నారు.
అందుబాటులో ఎరువులు
ఎరువుల కొరత రానివ్వకూడదని సర్కార్ ముందస్తు చర్యలు తీసుకున్నది. యూరియా 34,621, డీఏపీ 19,234, పొటాషియం 9,617, ఎస్ఎస్పీ 7,694తోపాటు ఇతర ఎరువులు 28,850 మెట్రిక్ టన్నులు జిల్లాలో అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. విత్తనాలు, ఎరువులు కావాలంటూ రాస్తారోకో, బంద్లో చేసే రోజులకు కాలం ముగిసింది. దీంతోపాటు రైతుబంధు, రైతుబీమాతోపాటు సాగునీరు కూడా పుష్కలంగా అందుబాటులో ఉండడంతో సంబురంగా సాగు పనిలో నిమగ్నమయ్యారు.
రైతులకు ఇబ్బందులు రానీయ్యం
రైతును లాభాసాటిగా ముందుకు తీసుకెళ్లేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నాం. వ్యవసాయ అధికారులు ఎప్పటిప్పుడు సలహాలు, సూచనలు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధికంగా లాభం చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆరుతడి పంటలతో అధిక లాభాలు వస్తాయి.
– వెంకటయ్య, జేడీ,మహబూబ్నగర్
నేడు సాగుపై శాస్త్రవేత్తల చర్చ,అవగాహన:హాజరుకానున్న మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు
సాగు విధానంపై వ్యవసాయ శాస్త్రవేత్తలతో సలహాలు, సూచనలు అందించేందుకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జేజేఆర్ గార్డెన్లో మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమావేశానికి మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు, పీఏసీసీఎస్ అధ్యక్షులు, డీసీసీబీ అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, జిల్లా, మండల, గ్రామ రైతుబంధు సమితి డైరెక్టర్లతోపాటు శాఖ అనుబంధ కార్యాలయ అధికారులు హాజరుకానున్నారు. కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు వెంకటయ్య, సుధాకర్ తెలియజేశారు.