కొల్లాపూర్, జూన్ 23 : పట్టణంలోని సివిల్ దవాఖానకు ప్రభుత్వం డయాలసిస్ సెంటర్ను మంజూరు చేసిందని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి తెలిపారు. త్వరలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. 15 ఏండ్ల తర్వాత తొలిసారిగా రామాపురం మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కుటుంబ నియంత్రణ (బటన్హోల్) ఆపరేషన్ శిబిరాన్ని అదనపు డీఎంహెచ్వో వెంకట్దాస్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో ప్రభుత్వ దవాఖానల్లో పెనుమార్పులు చేసినట్లు వివరించారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 50 పడకలను 100 పడకలకు అప్గ్రేడ్ చేయించినట్లు తెలిపారు.
ఇందుకుగానూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. బటన్హోల్ ఆపరేషన్లు 120 మందికి చేయాలనుకుంటే అదనంగా మరో 30 మంది వచ్చారని తెలిపారు. వీరికి ఆపరేషన్లు చేయాలని వైద్యాధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. వచ్చిన మహిళలకు ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించామన్నారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ మురళీధర్, డాక్టర్లు యశ్వంత్రాణి, భరత్రావు, దళితబంధు నియోజకవర్గ కోఆర్డినేటర్ కాటం జంబులయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్ నాయక్, మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మహిమూదాబేగం, రైతుబంధు సమితి మండల చైర్మన్ నిరంజన్, సర్పంచ్ భారతీ యాదవ్, ఎంపీటీసీ వరలక్ష్మీ యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంచందర్ యాదవ్ పాల్గొన్నారు.