ఎర్రవల్లి చౌరస్తా, జూన్ 5 : ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సు గమ్యం చేరలేదు. ముందు వెళ్తున్న కంటైనర్ను బలంగా ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలైన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కోదండాపూర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకున్నది. ఎస్సై వెంకటస్వామి కథనం మేరకు.. మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామానికి చెందిన ప్రేమ్రాజ్ (39) గద్వాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
అయితే డ్యూటీలో భాగంగా హైదరాబాద్కు బస్సు (టీఎస్ 33 జెడ్ 0020)ను నడుపుతూ వెళ్లి శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి గద్వాలకు బస్సు బయలుదేరింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇటిక్యాల మండలం ధర్మవరం స్టేజీ వద్దకు రాగానే ముందు వెళ్తున్న కంటైనర్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో తప్పించే క్రమంలో వెనుక ఉన్న బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ ప్రేమ్రాజ్కు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సాయంతో అంబులెన్స్లో కర్నూల్ దవాఖానకు తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా.. మిగితా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్కు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నాడు. కండక్టర్ నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.