వనపర్తి రూరల్, మే 25 : వేసవి దుక్కులతో పంటలకు ఎన్నో ప్రయోజనాలుంటాయి. చాలామంది రైతులు యాసంగి పంటలు పూర్తి కాగానే పొలాన్ని వదిలేసి తొలకరి పలుకరించగానే వానకాలం సాగుకు సిద్ధమవుతారు. చినుకులు కురవగానే దుక్కులు దున్నడం ప్రారంభిస్తారు. అలాకాకుండా వేసవిలోనే దుక్కులు దున్నడంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. వేసవిలో దుక్కి దున్నితే భూమి ఎండకు బాగా కాలడంతో చీడపీడలు నశిస్తాయి. దీంతో పంట వేశాక క్రిమికీటకాల బెడద ఉండకపోగా రసాయనాలు పిచికారీ చేయాల్సిన అవసరం రాదు.
వేసవి దుక్కులతో ఎన్నో ఉపయోగాలు..
కలుపు నివారణకు దోహదం..
వేసవిలో దుక్కి దున్నకుండా వదిలేస్తే కలుపు మొక్కలు పెరుగుతాయి. అవి భూమిలోని నీరు, పోషక పదార్ధాలను గ్రహించడం వల్ల భూమిలోపలి పొరల్లోని నీరు ఇంకిపోగా భూసారం కూడా తగ్గుతుంది. దీంతో ఆ తరువాత సాగు చేసిన పంటకు పోషక పదార్థాలు అందవు. కాగా ఆశించినస్థాయిలో పంట దిగుబడి రాదు. అందుకే రైతులు వేసవి దుక్కులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఏటా ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసే అకాల వర్షాలను ఉపయోగించుకొని భూమిని 25 నుంచి 30 సెంటీమీటర్ల లోతులో దుక్కి దున్నుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
రెక్క నాగలి లేదా పల్లపు నాగలితో..
వేసవిలో దుక్కుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రెక్కనాగలి లేదా పల్లపు నాగలిని ఉపయోగించాలి. ఇవి నేలను పాయలుగా కోసి మట్టిని తిరగేస్తాయి. మెట్ట సేద్యానికి ఆరు అంగుళాల రెక్కనాగలి బాగా ఉపయోగపడుతుంది. తేమ ఎక్కువగా ఉండే గట్టి భూముల్లో పల్లపు నాగలిని ఉపయోగించాలి. గతంలో వేసిన పంట అవశేషాలు ఎక్కువగా ఉంటే అలాంటి భూముల్లో పల్లపు నాగలి బాగా దున్నుతుంది.
అన్ని విధాలా మేలు..
భూమిని 25-30 సెంటీమీటర్ల లోతు వరకు దున్నడంతో నేలలో గాలి లభ్యత పెరిగి సూక్ష్మజీవుల సాంద్రత పెరుగుతుంది. కర్భన పదార్థం లభ్యత పెరిగి నేలసారం పెరుగుతుంది. భూమికి వాలుగా దుక్కి దున్నడంతో వర్షం పడినప్పడు నీరు నేల లోపలికి ఇంకుతుంది. భూమికి నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది. వాతావరణంలోని నత్రజని వర్షం నీటితో కలిసి నేలలోకి చేరడంతో భూసారం మరింత పెరుగుతుంది.
– కురుమయ్య, ఏవో, వనపర్తి