నాగర్కర్నూల్, మే 24(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆవిర్భావ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఉదయం జాతీయ పతాకావిష్కరణ ఉంటుందన్నారు. ఇందులో భాగం గా ముఖ్యఅతిథికి పోలీస్ గౌరవ వందనం, జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగం ఉంటుందన్నారు. అలాగే వివిధ శాఖల ద్వారా స్టాళ్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందులో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని ప్రదర్శించాలన్నారు.
అనంతరం సాయం త్రం 4గంటలకు కలెక్టరేట్లో కవి సమ్మేళనం ఉంటుందన్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఆయా శాఖల అధికారులకు బాధ్యతలను కేటాయించారు. ప్రోటోకాల్ బాధ్యత ఆర్డీవోకు, మైదానం, బారికేడింగ్ ఆర్అండ్బీ ఈఈ, సుందరీకరణ బాధ్యత ఉద్యానశాఖ అధికారికి అప్పగించారు. ఉదయం పరేడ్ గ్రౌండ్ వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. పల్లె, పట్టణ ప్రగతి, నర్సరీల ఏర్పాటులో బాగా కృషి చేసిన అధికారులు, ఉద్యోగులకు అవార్డులు అందజేసి సత్కరిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్కుమార్, డీఎస్పీ దీపక్చంద్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.