మహబూబ్నగర్టౌన్, మే 24: పదో తరగతి పరీక్ష వార్షిక పరీక్షలు మంగళవారం రెండోరోజు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 13,268మంది విద్యార్థులకుగానూ, 13,082 మంది విద్యార్థులు హాజరయ్యారు. 186మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నలుగురు ఫ్లయింగ్స్కాడ్లు, 11మంది కస్టోడియన్లు, 666మంది ఇన్విజిలేటర్లు, 59మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 59మంది డిపార్డ్మెంటల్ అధికారులు విధులు నిర్వహించారు. పరీక్షల నిర్వహణను డీఈవో ఉషారాణి పర్యవేక్షించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మోడల్ బేసిక్ ప్రాక్టిసింగ్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ వెంకట్రావు తనిఖీ చేసి వసతులను పరిశీలించారు. పరీక్షలు ముగిసేవరకు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
మూసాపేటలో డీఈవో తనిఖీ
మూసాపేట, మే 24 : మండలకేంద్రంతోపాటు జానంపేట పరీక్షా కేంద్రాలను మంగళవారం డీఈవో ఉషారాణి తనిఖీ చేశారు. కేంద్రాల్లో వసతులు, పరీక్షల నిర్వాహణ, విద్యార్థుల హాజరును పరిశీలించారు. ఎంఈవో రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ మూసాపేట కేంద్రంలో 169మంది విద్యార్థులకుగానూ ఐదుగురు, జానంపేటలో 233మందికి గానూ నలుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. డీఈవో వెంట తాసిల్దార్ మంజుల, ఎంపీడీవో స్వరూప ఉన్నారు.
అడ్డాకుల పాఠశాలలో డీఎఫ్వో
మూసాపేట(అడ్డాకుల), మే 24: అడ్డాకుల పాఠశాలలో పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని మంగళవారం మండల ప్రత్యేకాధికారి, డీఎఫ్వో గంగిరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట నాయబ్ తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో మంజుల, ఎంపీవో విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.
14మంది గైర్హాజరు
బాలానగర్, మే 24 : మండలకేంద్రంలోని ఏకలవ్య హై స్కూల్, టీఎస్ రెసిడెన్షియల్, బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం పదో తరగతి పరీక్ష రెండోరోజు ప్రశాంతంగా జరిగిందని ఇన్చార్జి ఎంఈవో వెంకటయ్య, సీఆర్పీ లోకేశ్వరీ తెలిపారు. 739మంది విద్యార్థులకుగానూ 14మంది గైర్హాజరైనట్లు వారు తెలిపారు.