కల్వకుర్తి, మే 20 : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. నవోదయ, ఉన్నతవిద్య కళాశాల ఏర్పాటులో బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం సహాయనిరాకరణ చేస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ అంకుఠిత దీక్షతో రాష్ర్టాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్తున్నాడని మంత్రి పేర్కొన్నారు. గురువారం మార్చా ల గ్రామంలో రూ.22లక్షలతో నిర్మించిన రైతువేదిక, మైనార్టీ కమ్యూనిటీహాల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించిన ప్రహరీ, సైన్స్ల్యాబ్ ప్రారంభోత్సవం, జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ను ఎమ్మెల్యే జైపాల్యాదవ్, నాగర్కర్నూల్ ఎంపీ రాములు, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతితోకలిసి మంత్రి ప్రారంభించారు.
అదే విధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో రూ.70లక్షలతో చేపట్టనున్న మౌలిక వసతుల కల్పన, సీసీరోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశా రు. అనంతరం జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మొక్కవోని సంకల్పంతోనే రాష్ర్టాభివృద్ధి సాగుతుందని చెప్పారు. కేంద్రం సహకరించకున్నా రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో 1000 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని మంత్రి వివరించారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయన్నారు. ప్రైవేటు పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలు రూపాంతరం చెందనున్నాయని మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని, పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంగా విద్యాబోధన సాగుతుందని, ఇందుకు సంబంధించి ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేశామని మంత్రి వివరించారు. మార్చాల గ్రామస్తుల కోరిక మేరకు మార్చాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒకేషనల్ ఇంటర్ కళాశాల ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తానని మం త్రి హామీ ఇచ్చారు. ఇందుకు సబంధించిన ప్రపోజల్స్ పంపించాలని డీఈవో గోవిందరాజులును మంత్రి ఆదేశించారు.
నాగర్కర్నూల్ ఎంపీ రాములు మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ముఖ్యమంత్రి మనఊరు-మనబడి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఎంపీ చెప్పారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మనూచౌదరి మాట్లాడుతూ మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా మార్చాల ఉన్నత పాఠశాలకు రూ. 47లక్షలు, ప్రాథమిక పాఠశాలకు రూ.24లక్షలు కేటాయించనట్లు వివరించారు. మార్చాల పర్యటనలో భా గంగా మంత్రి, ఎమ్మెల్యేలు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ బాలాజీసింగ్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోళి శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ మనోహర, జెడ్పీటీసీ భరత్ప్రసాద్, డీఈవో గోవిందరాజులు, పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్రెడ్డి, ఇన్చార్జి సర్పంచ్ సునీత, డీఎస్సీ గిరిబాబు, ఎంఈవో బాసునాయక్, టీఆర్ఎస్ నాయకులు విజయ్గౌడ్, మనోహర్రెడ్డి, బాలయ్య, లింగంతోపాటు గ్రామస్తు లు, విద్యా ర్థులు తదితరులు పాల్గొన్నారు.