అచ్చంపేట, మే 18 : బీజేపీ నాయకులు తనను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 500 ఏండ్ల నాటి కిన్నెర కళను గుర్తించి సీఎం కేసీఆర్ జీవం పోశారని, ఆయన మేలు ఎన్నటికీ మరువనన్నారు. అయితే కేసీఆర్ను, తన కళను అవమాన పరిచే విధంగా కమలం పార్టీ నేతల వైఖరి ఉందని, అవసరమైతే పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని ఆయన భావోద్వేగంతో చెప్పారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అచ్చంపేటకు చెందిన బీజేపీ నేత మంగ్యానాయక్ తనను ఉద్దేశపూర్వకంగా పిలింపించుకొని సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.కోటి ఇచ్చారా.. అంటూ అవహేళనగా మాట్లాడారని, తనకు తెలియకుండానే వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మశ్రీ అవార్డు ఇచ్చింది కేసీఆర్ కాదని.. కేంద్రంలోని బీజేపీ అని, నీకు రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని, ప్రకటించిన రూ.కోటి కేసీఆర్ ఇంట్లో నుంచి ఇస్తలేరని బీజేపీ నేత అవమానించేలా మాట్లాడడం తనకు బాధ కలిగించిందన్నారు.
ఇన్ని అవమానాల పద్మశ్రీ అవార్డు తనకు వద్దని.. అవసరమైతే తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. మొదటగా తన కళను గుర్తించి ఉగాది పురస్కారం ఇచ్చారని.. కళ బయటకు రాకుంటే తనకు గుర్తింపు ఎక్కడిదన్నారు. రాష్ట్ర ప్రభు త్వం రెండేండ్ల నుంచి ప్రతినెలా రూ.10 వేల పింఛన్ ఇస్తుండడం వల్లే తన కుటుంబం ఉన్నదాంట్లో బతుకుతున్నామన్నారు. తన గురించి పాఠ్యపుస్తకంలో పొందుపర్చడం, బేగంపేట బ్రిడ్జి పిల్లర్పై తన ఫొటోను ముద్రించి సీఎం కేసీఆర్ హయాంలో తనకు ఎనలేని గుర్తింపునిచ్చారన్నారు. తన కళను రాజకీయం చేసేవిధంగా బీజేపీ నేత వ్యవహరించడం జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. బుద్ధిలేని వ్యక్తి పైశాచిక ఆనందం కోసం చేసిన పనికి అందరం బాధపడాల్సి వస్తుందన్నారు.