జడ్చర్లటౌన్, మే 18: ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ కీలకమైందని పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పవన్కుమార్ చెప్పారు. జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జరిగిన వార్షికోత్సవ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిభ ఉన్న వారికి స్వదేశంతోపాటు విదేశాల్లోనూ పరిశోధనావకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. మంచి స్కాలర్షిప్తో విశ్వవిద్యాలయాల్లో కూడా పరిశోధన చేయొచ్చన్నారు. అంతకుముందు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పీయ చిన్నమ్మ, వైస్ ప్రిన్సిపాల్ రవీందర్రావు మాట్లాడారు.
అధ్యాపకులు నిబద్ధతతో కృషి చేస్తుండడంతోనే విద్యార్థులు మంచి ఫలితాలను తీసుకొస్తున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులందరూ ప్రతిభను చాటాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. క్రీడా సాంస్కృతిక, సాహిత్య అంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అలాగే తెలంగాణ బొటానికల్ గార్డెన్ రూపొందించి రాష్ట్రస్థాయిలో పేరు తెచ్చిన గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ సదాశివయ్యను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఎన్. సుభాషిణి, శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు.