మహబూబ్నగర్టౌన్, మే 15 : మార్షల్ ఆర్ట్స్తో స్వీయరక్షణ ఉంటుందని, బాలబాలికలు తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో డ్రాగన్ షోటోకాన్ కరాటే-డూ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు బెల్టుగ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు ఇంతియాజ్ ఇసాక్ బెల్టులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసంతోపాటు దేహదారుఢ్యం పెంపొందుతుందని తెలిపారు.
క్రీడల్లో రాణించేవారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు కరాటే శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. డ్రాగన్ షోటోకాన్ కరాటే-డూ ఇండియా చీఫ్ సలాంబిన్ ఉమర్ మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో వేసవిలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 62మంది విద్యార్థులకు బెల్టుగ్రేడింగ్ పరీక్షలు నిర్వహించి బెల్టులను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డ్రాగన్ షోటోకాన్ కరాటే-డూ ఇండియా చీఫ్ ఎగ్జామినర్ అమ్రేశ్, రాజు, మోసిన్, వెంకట్రాములు, జాన్సుందరం తదితరులు పాల్గొన్నారు.