వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రయోజనం
సకల సౌకర్యాలతో ‘మన ఊరు-మన బడి’
సర్కారు స్కూళ్లకు సరికొత్త హంగులు
పల్లెల్లో కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన
మహబూబ్నగర్టౌన్, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. గత పాలకుల నిర్లక్ష్యంతో ఆదరణ కోల్పోయిన సర్కారు బడులకు ఊపిరిపోస్తున్నది. మసకబారిన ప్రభుత్వ విద్యకు జవసత్యాలు తీసుకొస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నది. ప్రైవేట్కు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నది. ప్రతి పాఠశాలలో నూతన తరగతి గదులు, మధ్యాహ్న భోజనం కోసం సరిపోయే ఫర్నిచర్, గ్రీన్చాక్ బోర్డుల ఏర్పాటు, ప్రహరీల నిర్మాణం తదితర సమస్యలకు చెక్ పెట్టేందుకు ‘మన ఊరు-మన బడి’ ప్రణాళిక కోసం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సర్కార్ విద్యకు తక్కువ ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలతో సర్కారు బడులు క్రమక్రమంగా మూతబడుతూ వచ్చాయి. ఉపాధ్యాయుల నియామకం, పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల హాజరు పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రైవేట్ పాఠశాలలకు పెద్దపీట వేశాయి. ఫలితంగా ప్రభుత్వ బడులకు ఆదరణ కరువైంది. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మెరుగైన విద్య అందించేలా చర్యలు తీసుకున్నది. అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఎంపికచేసి ఇంగ్లిష్ మీడి యంలో విద్యను బోధించేందుకు సీఎం కేసీఆర్ కేబినేట్ ఆమోదం తెలిపింది. దీంతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు కార్పొరేట్స్థాయి విద్య చేరువ కానున్నది. సొంతూళ్లోనే ఇంగ్లిష్ మీడియంలో చదివేందుకు వెసులుబాటు కలగనున్నది. ఈ సందర్భంగా మేధావులు, ఉన్నత విద్యావంతులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
డిజిటల్ బోధన అమలు
సాంకేతిక రంగం విస్తరిస్తున్నది. విద్యార్థుల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నది. చిన్న వయసులోనే కంప్యూటర్ నైపుణ్యం సాధిస్తున్నారు. వారికున్న పరిజ్ఞానంతో డిజిటల్ బోధన సులభతరం కానున్నది. సమాజంలో మార్పులకు అనుగుణంగా తరగతి గదులను మార్పు చేస్తూ ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు, టీవీతో బోధించడం ద్వారా విద్యార్థులు సరికొత్త అనుభూతి పొందనున్నారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విద్యార్థులకు డిజిటల్ బోధన అవసరమని భావించి విద్యార్థి దశ నుంచే డిజిటల్ బోధన అందించాలని సంకల్పించి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నది. సాధారణ బోధన కంటే డిజిటల్(స్క్రీన్)పై బోధించడం ద్వారా విద్యార్థులు పాఠాలను త్వరగా అర్థం చేసుకుంటారు. డిజిటల్ బోధనతో సర్కారు విద్య బలోపేతం కానున్నది. మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 834పాఠశాలలు ఉండగా ఇందులో 612 ప్రాథమిక, 88యూపీఎస్, 134 హైస్కూళ్లు ఉన్నాయి. 72,103మంది విద్యార్థులున్నారు.
రోల్మోడల్గా సర్కారు బడులు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌస్తో ప్రొజెక్టర్పై బోధించేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామాల నుంచి పట్టణాల్లోని స్కూల్స్కు మార్చేందుకు ఆలోచన చేస్తున్న సమయంలో డిజిటల్ విద్య ప్రవేశపెట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు రోల్మోడల్గా నిల్వనున్నాయి. విద్యార్థుల సంఖ్య పెరగనున్నది.
ప్రభుత్వ బడి.. సౌకర్యాల ఒడి
ఇక చెట్ల కింద బోధనలకు కాలం చెల్లింది.. అరకొర తరగతి గదుల్లో చదవాల్సిన పనిలేదు. ప్రతి పాఠశాలల్లో నూతన తరగతి గదులను నిర్మించనున్నారు. పాఠశాలల్లో తాగునీటి వసతి కల్పించనున్నారు. విద్యార్థులకు వేడి వేడి భోజనం అందించేందుకు వీలుగా కిచెన్ షెడ్లు, డైనింగ్ హాల్ నిర్మించనున్నారు. కొన్ని పాఠశాలల్లో టాయిలెట్స్ లేక విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. ఇక విద్యార్థులకు అలాంటి సమస్య లేకుండా నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు సమకూర్చనున్నారు. వీటితోపాటు విద్యార్థులు, సిబ్బందికి సరిపోయే ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డుల ఏర్పాట్లు, ప్రహరీ నిర్మాణం తదితర సమస్యలను మన ఊరు మనబడి కార్యక్రమంలో పరిష్కరించనున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సర్కారు బడుల్లో ఆంగ్ల బోధన వరంలా మారనున్నది.
ఆంగ్ల మాధ్యమం పేదలకు వరం
ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రకటించడం సంతోషకరం. బడుగు, బలహీన వర్గాలకు వరం. సీఎం కేసీఆర్ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యారంగంలో సమూల మార్పులు చేస్తున్నారు. విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు మౌలిక సదుపాయాల కల్పన, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణపై అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామనడం హర్షణీయం ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో పేద విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై విద్యార్థి లోకం హర్షిస్తుంది.