మహబూబ్నగర్/గద్వాల అర్బన్/ఉండవెల్లి/జడ్చర్లటౌన్, డిసెంబర్ 20: రైల్వే సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకుగానూ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రధాన రైల్వేస్టేషన్ను సౌత్ సెంట్రల్ జీఎం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎం మాట్లాడారు. ఇప్పటికే మహబూబ్నగర్-సికింద్రాబాద్ మధ్య పూర్తిస్థాయిలో డబ్లింగ్ పనులు, విద్యుత్ ప్రక్రియ పూర్తయిందన్నారు. హైదరాబాద్ నుంచి జైపూర్ వరకు రైలును నడిపించేందుకు అవసరమైన పక్కా ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలిపారు. అలాగే జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా డిజిట్ పోస్టర్లు, రాయిచూర్ రైల్వే విద్యుత్ లైన్, సిబ్బంది క్వాటర్స్, గూడ్స్ పనులను ప్రారంభించారు. జోగుళాంబ హాల్ట్ను సందర్శించి రూ.5.55లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ సిస్టమ్ను ప్రారంభించారు.
అనంతరం జోగుళాంబ రైల్వే హాల్ట్ ప్లాట్ఫారం ఎత్తు పెంపు, మురుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, ఎక్స్ప్రెస్ రైలు నిలపాలని జోగుళాంబ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే తనయుడు అజయ్, ఉండవెల్లి రైతుసంఘం నాయకులు వినతులు సమర్పించారు. హాల్ట్ వద్ద అండర్ బ్రిడ్జి కాకుండా ఫ్లైఓవర్ వంతెన నిర్మించాలని కోరగా.. రాష్ట్ర ప్రభు త్వం నిధులు మంజూరు చేస్తే నిర్మించుకోవచ్చని, కేంద్రం నుంచి అండర్ బ్రిడ్జి నిర్మాణానికి మాత్రమే అనుమతులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే జడ్చర్ల రైల్వేస్టేషన్లో నిర్మించిన ప్రధాన గూడ్స్ పర్యవేక్షణాధికారి కార్యాలయాన్ని ప్రారంభించారు. జడ్చర్ల రైల్వే గేటు సమస్య పరిష్కరించాలని కోరుతూ స్థానిక నాయకులు విన్నవించారు. త్వరలోనే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రైల్వే జీఎం వెంట డీఎం శరత్చంద్రయాన్, రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.