అచ్చంపేట, డిసెంబర్ 20: నల్లమలలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అచ్చంపేటలో నూతనంగా నిర్మించిన 100పడకల దవాఖానలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. కేంద్రానికి మూడు గదులు కేటాయించారు. పరికరాల బిగింపు, విద్యుత్, పైపులైన్ పనులు కొనసాగుతున్నాయి. కిడ్ని వ్యాధిగ్రస్తులు, హెచ్ఐవీ బాధితులకు వేర్వేరుగా సేవలు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కృషితో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు నల్లమలలో పేదలు, గిరిజనులు, దళితులకు ఆధునిక వైద్యం అందుబాటులో ఉండేందుకు ఆక్టోబర్లో డయాలసిస్ సెంటర్ మంజూరు చేశారు. అచ్చంపేటలో డయాలసిస్ కేంద్రంలేక హైదరాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్కు వెళ్లి చేయించుకుంటున్నారు.
దీంతో వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి రోగి నెలలో అనేకసార్లు డయాలసిస్ చేయించుకోవడంతో వైద్యం, రవాణా ఖర్చుభారంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అలాంటి వారికి అచ్చంపేటలో కొత్తగా మంజూరైన డయాలసిస్ సెంటర్ వరం లాంటిది. పేదలకు ఈ సెంటర్ ద్వారా ఉచిత సేవలు అందించనున్నారు. ఒక డయాలసిస్ మిషన్పై రోజుకు నలుగురు చొప్పున నాలుగు మిషన్లపై 16మంది డయాలసిస్ చేయంచుకునే అవకాశం ఉంది. అచ్చంపేట ప్రాంతంలో పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు విప్ గువ్వల బాలరాజు దృష్టిసారించడంతో అధునాతనమైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తున్నాయి.