వనపర్తి, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): వనపర్తి ఎడ్యుకేషన్ హబ్గామారింది. అన్ని రకాల కళాశాలలు కొలువు దీరడంతో విద్యాసంస్థలకు కేంద్ర బిందువుగా గుర్తింపు పొందింది. రెండేండ్లలోనే వినూత్న కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. మెడికల్, మత్స్య, ఉద్యానవన, మహిళా అగ్రికల్చరల్, జేఎన్టీయూ ఇంజినీరింగ్, పీజీ, ఐటీఐ, నర్సింగ్ వంటి ప్రతిష్టాత్మక కళాశాలలు జిల్లాను వరించాయి. ఐటీఐ, పీజీ కాలేజీ భవనాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. సోమవారం మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్రెడ్డి వీటిని ప్రారంభించనున్నారు.
విద్యాసంస్థలకు వనపర్తి జిల్లా కేంద్ర బింధువు మారుతున్నది. కొత్త కోర్సులతోకూడిన వినూత్న కళాశాలలు జిల్లాలో కొలువుదీరుతున్నాయి. మంత్రి నిరంజన్రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేస్తున్న కళాశాలలతో ఎడ్యుకేషన్ హబ్గా వనపర్తి రూపుదిద్దుకుంటున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నది. అందులో భాగంగానే వనపర్తి జిల్లాకు కేవలం రెండేండ్ల కాలంలోనే అనేక కాలేజీలను మంజూరు చేసింది. అందులో మత్స్యకళాశాల, ఉద్యానవన కళాశాల, మహిళా అగ్రికల్చరల్ కళాశాల, మెడికల్ కళాశాల, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, పీజీ కళాశాల, ఐటీఐ, నర్సింగ్ తదితర కళాశాలలు వనపర్తి జిల్లాను వరించాయి. ఇందులో మహిళా అగ్రికల్చరల్ కళాశాల దేశంలో ఎక్కడా లేనటువంటి విధానంలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో బీసీ సంక్షేమశాఖ నుంచి అనుమతి తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కళాశాలలతో పాటు హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేశారు.
మహిళా వ్యవసాయ కళాశాల ప్రత్యేకం
జీవో నెంబర్ 20 ప్రకారం అక్టోబర్ 17, 2020న మహిళా వ్యవసాయ కళాశాల మంజూరైంది. ని బంధనలు సవరించి కరీంనగర్, వనపర్తి జిల్లాలకు కళాశాలలను రాష్ట్రంలో ముందుగా మంజూరు చేశారు. వనపర్తి మండలం పెద్దగూడెంలో ఏర్పా టు చేయనున్న ఈ కాలేజీలో 120మంది విద్యార్థులు ఎంసెట్ కౌన్సెలింగ్లో సీట్లు పొందారు. తరగతులు ఈనెల 19 (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి.. మహాత్మా జ్యోతీరావుఫూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ నుంచి ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఒక బీసీ సంక్షేమశాఖ నిధులు, పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి కళాశాల ఇది.
జేఎన్టీయూహెచ్
ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటి పాలిటెక్నిక్ కళాశాల వనపర్తిలో స్థాపించిన చరిత్ర ఉంది. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతులమీదుగా ప్రారంభించారు. విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందించేందుకు జేఎన్టీయూహెచ్కు అనుబంధంగా ఇంజినీరింగ్ కళాశాలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. ఇందులో ఐదు ముఖ్యమైన బ్రాంచీలకు అనుమతి ఇచ్చారు. దీనిని కూడా సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకోసం వనపర్తి జిల్లా కేంద్రంలో 45 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతానికి పాలిటెక్నిక్ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. 123మంది విద్యార్థులు ఉండగా, 102మంది విద్యార్థులు హాస్టల్కు ఎంపికయ్యారు. హాస్టల్ భవనం కోసం మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు.
ఐటీఐ కళాశాల..
విద్యార్థుల్లో వృత్తివిద్య నైపుణ్యం పెంచేందుకు నిర్మించిన కళాశాల భవనాన్ని మంత్రుల బృందం ప్రారంభించనున్నది. కార్మిక , ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, పౌరసరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి కలిసి ప్రారంభించనున్నారు. ఐటీఐలో ఉండాల్సిన వృత్తి విద్యాకోర్సులు నాలుగు ఉంటాయి. కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్స్, డ్రాప్ట్మెన్ సివిల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ట్రేడులు కలిసి 176మంది విద్యార్థులు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు.
పీజీ కళాశాల భవనం ప్రారంభం
2002లో ఉస్మానియా యూనివర్శిటీకీ అనుబంధంగా ప్రారంభమైన ఈ కళాశాల తర్వాత పాలమూరు యూనివర్శిటీ పరిధిలోకి వెళ్లింది. అనేక పీజీ కోర్సులతో కొనసాగుతున్న ఈ కాలేజీకి కొత్త భవనం నిర్మించారు. భవనాన్ని మంత్రుల బృం దం సోమవారం ప్రారంభించనున్నది. ఇందులో 1800మంది విద్యార్థులు పీజీ చేస్తున్నారు.
విద్యారంగంలో అగ్రగామిగా..
వనపర్తి, డిసెంబర్ 18 : విద్యారంగంలో వనపర్తి జిల్లా అగ్రగామిగా నిలుస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం కృషితో సోమవారం పలు విద్యాసంస్థలకు వివిధ శాఖల మంత్రులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10:30గంటలకు జేఎన్టీయూ కళాశాల, పాలమూరు యూనివర్సిటీ పీజీ కళాశాల భవనం, 11గంటలకు ఐటీఐ కళాశాల ప్రారంభోత్సవం, 11:15గంటలకు జేఎన్టీయూ వసతిగృహానికి శంకుస్థాపన, మధ్యాహ్నం 12గంటలకు బీసీ రెసిడెన్షియల్ మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే 12:30గంటలకు పెద్దగూడెం క్రాస్రోడ్డు వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కార్మిక, ఉపాధిశాఖ మంత్రి మల్లారెడ్డి, ఉన్నతాధికారులు వెంకటేశం, హనుమంతు, జోండగో, కట్ట నర్సింహారెడ్డి, జేఎన్టీయూ కళాశాల వైస్ చాన్స్లర్, కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా తదితరులు హాజరు కానున్నట్లు మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
శరవేగంగా విద్యాసంస్థల నిర్మాణం
వనపర్తి జిల్లాలో విద్యాసంస్థల ఏర్పాటు పెద్దఎత్తున జరుగుతున్నది. జిల్లాలో మెడికల్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, పీజీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాల, ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి కళాశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. ఎంసెట్ ర్యాంకులతో విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. రెండేండ్లలో దాదాపు అన్ని కోర్సులకు సంబంధించి విద్యాసంస్థలు మంజూరయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అన్ని కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్లు పూర్తిచేశాం. సోమవారం నుంచి మహిళా వ్యవసాయ కళాశాలకు సంబంధించిన తరగతులను కూడా మంత్రుల చేతులమీదుగా ప్రారంభం కానున్నాయి. – షేక్ యాస్మిన్బాషా, కలెక్టర్, వనపర్తి