హన్వాడ, నవంబర్ 29: మందుబాబులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే, వాహనాలు నడిపితే తస్మాత్ జాగ్రతగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో చెట్లకింద, అడవులో, రోడ్లకు ఇరువైపులా, ఆలయాల చుట్టుపక్కల్లో మద్యం సేవిస్తే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. నవంబర్ ఒక్క నెలలో హన్వాడ మండలంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 18మందిపై, మద్యం సేవించి వాహనాలు నడిపిన ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మద్యంప్రియులు ఇంటివద్ద ప్రశాంతంగా మద్యం సేవిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయని, ముఖ్యంగా గ్రామాల్లో బెల్ట్షాపుల్లో రాత్రివేళల్లో మద్యం విక్రయించొద్దని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రచారం చేస్తున్నారు.
జాగ్రత్తగా ఉండాలి
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు. ప్రజలు, వాహనదారులకు ఇబ్బంది కలిగించే ప్రదేశాల్లో మద్యం సేవించి ఇబ్బందులకు గురిచేస్తే కేసులు నమోదు చేస్తాం. దేవాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయంలో ఎవరైనా మద్యం సేవిస్తే సమాచారం ఇవ్వాలి. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుశిక్ష విధించనున్నట్లు హెచ్చరించారు.
– రవినాయక్, ఎస్సై, హన్వాడ