మదనాపురం, నవంబర్ 27 : ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలో సికింద్రాబాద్-గద్వాల మధ్య విద్యుత్ రైళ్లను నడిపిస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పీడీ.మిశ్రా వెల్లడించారు. ఆదివారం మదనాపురం (వనపర్తి రోడ్) రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలను ఆయా శాఖల అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. విద్యుద్ధీకరణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ 2018-19 రైల్వే బడ్జెట్లో మొత్తం రూ.916.07 కోట్లతో మన్మాడ్-ముద్దేడ్-డోన్ (769 రూట్ కిలోమీటర్ల) విద్యుద్ధీకరణ చేపట్టామన్నారు. మహబూబ్నగర్-డోన్ సెక్షన్ (179 రూట్ కిలోమీటర్లు)లో పనులు జరుగుతున్నాయని తెలిపారు. రైల్వే ఎలక్ట్రిఫికేషన్, సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ (కోర్) సికింద్రాబాద్ యూనిట్, ప్రియాగ్రాజ్ ద్వారా ప్రాజెక్ట్ అమలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గద్వాల-కర్నూల్ (53 రూట్ కిలోమీటర్లు) ఫిబ్రవరి 2023 నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. ఆయన వెంట రైల్వే అధికారులు ఉన్నారు.