వనపర్తి, నవంబర్ 22: అభివృద్ధిలో వనపర్తి ఆదర్శంగా నిలవాలని, వనపర్తి మార్కెట్ పనులను వేగంగా చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో జరుగుతున్న మోడల్ మార్కెట్ పనులు, జిల్లా కేంద్రానికి సమీపంలోని రాజపేట శివారులో జరుగుతున్న రాక్ పార్కు పనులను కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, సంబంధిత అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా వనపర్తిని అభివృద్ధి చేస్తున్నామని రోడ్ల విస్తరణను ప్రజల సహకారంతో పూర్తి చేస్తున్నామన్నారు. వనపర్తి చుట్టూ ఉన్న చెరువులను పటిష్టం చేయడంతో జిల్లా కేంద్రంలో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. అత్యధికంగా భూగర్భజలాలు పెరిగింది వనపర్తిలోనే అని మంత్రి గుర్తుచేశారు. రూ.49కోట్లతో వనపర్తి మార్కెట్ను నిర్మించామని, రూ.4 కోట్లతో ఎకో పార్కును అభివృద్ధి చేశామని, రూ 2 కోట్లతో వే సైడ్ మార్కెట్, నగరం నాలుగు దిక్కులా సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతోనే అభివృద్ధి సాధ్యమైందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆశిష్సంగ్వాన్, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి, తాసిల్దార్ రాజేందర్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పార్టీ పట్టణాధ్యక్షుడు రమేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.