అకాడమీలు క్రీడాకారులకు వరంగా మారాయి. క్రీడల్లో మరిన్ని మెళకువలు నేర్చుకునేందుకు దోహదపడుతాయి. ఔత్సాహిక క్రీడాకారుల కోసం మహబూబ్నగర్లో వాలీబాల్ అకాడమీని ఏర్పాటు చేశారు. ఈ క్రీడలో మరింత రాటుదేలేందుకు సరైన శిక్షణ ఇచ్చేలా రూ.19.70 లక్షలతో తీర్చిదిద్దారు. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవతో ఏర్పాటు చేసిన అకాడమీలో వచ్చే నెల 1వ తేదీన ఎంపికలు నిర్వహించనున్నారు.
– మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 22
మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 22 : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో త్వరలో వాలీబాల్ అకాడమీ అందుబాటులోకి రానున్నది. 2005-2008లో అకాడమీ ఏర్పాటు చేయగా, ఎంతో మంది శిక్షణ పొంది రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగారు. అయితే, 2008 తర్వాత సమైఖ్య పాలకులు పట్టించుకపోవడం, నిధుల కొరతతో అకాడమీ మూతపడింది. ఆ తర్వాత జిల్లా వాలీబాల్ సంఘం, ఎస్జీఎఫ్ టోర్నీలో సత్తాచాటి ఎంతో మంది క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదిగారు. ప్రత్యేక రాష్ట్రంలో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పట్టణాభివృద్ధి పైనే కాకుండా క్రీడాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ క్రమంలో మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో వాలీబాల్ అకాడమీ పునఃప్రారంభం కానున్నది. డిసెంబర్ 1న మహబూబ్నగర్ వాలీబాల్ అకాడమీలో ఎంపికలు నిర్వహించనున్నారు. రూ.19.70 లక్షలతో వాలీబాల్ అకాడమీ పనులు చేపట్టారు. స్టేడియం ఆవరణలో స్విమ్మింగ్ పూల్లో ఉన్న అంతస్తుల గదులను అకాడమీ క్రీడాకారుల వసతి కోసం కేటాయించారు. స్టేడియంలోని రెండు పాత వాలీబాల్ కోర్టులను తొలగించి.. వాటి స్థానంలో నూతన కోర్టులను ఏర్పాటు చేశారు. కోర్టుల చుట్టూ నాలుగు ఫ్లడ్లైట్లు, ప్రత్యేక షెడ్లు, గ్యాలరీలు నిర్మించారు.
గోడ చుట్టూ ఆకర్షణీయంగా వాలీబాల్ క్రీడా చిత్రాలను తీర్చిదిద్దారు. అదే విధంగా స్టేడియం ఆవరణలో మరో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రధాన స్టేడియం ఆధునీకరణ, ఇండోర్ స్టేడియం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో మినీ స్టేడియం పనులు జరుగుతున్నాయి. వాలీబాల్ అకాడమీలో వచ్చే నెల 1వ తేదీన 20 మంది బాలురు, 20 మంది బాలికలను ఎంపిక చేయనున్నారు. వాలీబాల్ అకాడమీ పునఃప్రారంభం కానుండడంతో క్రీడాకారులు, క్రీడా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం..
మహబూబ్నగర్ను హైదరాబాద్ తరహాలో అన్ని రంగాల్లో అభివృద్ధి చే స్తాం. పట్టణాభివృద్ధితోపాటు క్రీడాభివృద్ధిపై దృష్టి సారించాం. జిల్లాలో రూ.17.32 కోట్లతో క్రీడామైదానాలు డెవలప్ చేస్తున్నాం. ప్రధాన స్టేడియం ఆధునీకరణ, ఇండోర్ స్టేడియం పనులు వేగంగా జరుగుతున్నాయి. వాలీబాల్ అకాడమీని అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకొని జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి. అభివృద్ధిలో పార్టీలకతీతంగా భాగస్వాములు కావాలి.
– డా.వి.శ్రీనివాస్గౌడ్, క్రీడా శాఖ మంత్రి
1న వాలీబాల్ అకాడమీలో ఎంపికలు..
మంత్రి శ్రీనివాస్గౌడ్ కృషితో వా లీబాల్ అకాడమీ పునఃప్రారంభమవుతున్నది. వచ్చే నెల 1వ తేదీన ఎంపిక లు నిర్వహిస్తున్నాం. ఈ అకాడమీతో ప్రతిభ గల క్రీడాకారులకు వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు గా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే అకాడమీ పనులు పూర్తి చేశాం. వాలీబాల్ క్రీడాకారులు ఎంపికలను సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీనివాస్, డీవైఎస్వో, మహబూబ్నగర్