మహబూబ్నగర్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి వచ్చేనెల 4న హాజరుకానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన విజయవంతం చేయాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్ తేజస్నందలాల్పవార్, ఉన్నతాధికారుల బృందంతో కలిసి మంత్రి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. మంత్రి సమక్షంలో పార్టీ కార్యాలయంలో హన్వాడ మండలానికి చెందిన 100మందికిపైగా టీఆర్ఎస్లో చేరారు. జిల్లా కేంద్రంలోని మత్స్య సహకార శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు.
ఆనాడు ఉద్యమం కోసం పాలమూరు గడ్డ నుంచే సమర శంఖం పూరించిన ముఖ్యమంత్రి కేసీఆర్..ఈరోజు అదే గడ్డమీద అభివృద్ధికి శ్రీకారం చుట్టడం గర్వంగా ఉందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వచ్చేనెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఖరారైన నేపథ్యంలో సోమవారం కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ తేజస్నందలాల్పవార్, ఉన్నతాధికారుల బృందంతో కలిసి మంత్రి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ముఖ్యమంత్రి సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సక్సెస్ చేయాలని ఆదేశించారు. పాలకొండ సమీపంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ ప్రాంగణాన్ని పరిశీలించారు. ప్రారంభోత్సవాలపై అధికారులతో చర్చించారు. అనంతరం కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల చాంబర్లను ప్రత్యేకంగా ముస్తాబు చేయాలని ఆదేశించారు. ఆరోజు అన్ని శాఖల ముఖ్య అధికారులు హాజరయ్యేలా చూడాలన్నారు. ముఖ్యమంత్రి కోసం కొత్త కలెక్టరేట్ ప్రాంగణంలోనే ప్రత్యేక హెలీప్యాడ్ను ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. అక్కడి నుంచి మంత్రి, అధికారులు పెద్ద చెరువు ఎదురుగా చేపడుతున్న మినీ శిల్పారామం పనులను పరిశీలించారు. వీలైనంత త్వరలో తుదిరూపం ఇవ్వాలని పనులు వేగవంతం చేయాలన్నారు. అనంతరం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. సీఎం కేసీఆర్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేకంగా పరిశీలించి శుభ్రంగా ఉండేలా చూడాలని కాంట్రాక్టర్కు ఆదేశించారు. పాత కలెక్టరేట్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న చిన్నపిల్లల దవాఖాన ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తుండడంతో ఏర్పాట్లను పరిశీలించారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలన్నారు.
భారీ జనసమీకరణకు మంత్రి ప్లాన్
వచ్చేనెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు పర్యటనకు వస్తున్న సందర్భంగా భారీ జనసమీకరణ చేపట్టాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యనేతలతో మంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. జిల్లా కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం స్థానిక ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో సీఎం బహిరంగ సభ ఉంటుందన్నారు. సభకు ప్రతివార్డు, గ్రామం నుంచి భారీగా జనసమీకరణ చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. అర్బన్, రూరల్, మున్సిపాలిటీ, మండల నాయకులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. స్వాగత ఏర్పాట్లు కూడా ఘనంగా చేయాలన్నారు. గతంలో ఎవరూ ఇవ్వని విధంగా పాలమూరు జిల్లా కేంద్రానికి ఇటీవల సీఎం రూ.100కోట్లు ఇచ్చారన్నారి గుర్తు చేశారు. అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, నేతలు శ్రీకాంత్గౌడ్, సుదీప్రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
మహబూబ్నగర్, నవంబర్ 21: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సర్కార్ ముందుకు వెళ్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మత్స్య సహకార శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలకు మంత్రి హాజరై మాట్లాడారు. ప్రతి చెరువులోనూ చేపపిల్లలను ఉచితంగా వదులుతూ మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మత్స్యకారుల సౌసైటీ బాధ్యులను మంత్రి సత్కరించారు.
ఎంత కష్టమైనా శ్రమిస్తా
పేదలను ఉన్నతస్థాయికి తీసుకువచ్చేందుకు ఎంత కష్టమైన శ్రమిస్తానని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి తన క్యాంపు కార్యాలయంలో హన్వాడ మండల టీఆర్ఎస్ నాయకుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే నెల 4న సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతంచేయాలని పిలపునిచ్చారు. వంద మంది ఓటర్లకు బాధ్యులను నియమించామని అందరూ ఓటర్లకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని పరిష్కరించాలన్నారు.
ఇతర రాష్ర్టాల సచివాలయాల కన్నా..మన కలెక్టరేట్లు పెద్దవి
ఇతర రాష్ర్టాల సచివాలయాల కన్నా మన రాష్ట్రంలో ప్రభుత్వం నిర్మించిన కలెక్టరేట్లు పెద్దవిగా ఉన్నాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మంత్రి అధికారులతో కలిసి కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. కలెక్టరేట్ సమీపంలో జాతీయ రహదారి, బైపాస్ల నిర్మాణం వల్ల ప్రజలు గమ్యానికి తొందరగా చేరకునే వీలుంటుందన్నారు. పాత కలెక్టరేట్ భవనంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేస్తున్నామన్నారు. త్వరలో కొత్త బైపాస్ అందుబాటులో వస్తుందని డిసెంబర్లో చించోలి మహబూబ్నగర్ రహదారి పనులు ప్రారంభమవుతాయన్నారు. త్వరలో కేసీఆర్ ఎకో పార్కులో 800రకాల పక్షలు ఉండేలా బర్డ్ క్లోజర్ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ప్రతి కుటుంబానికీ టీఆర్ఎస్ అండ
ప్రతి కుటుంబానికీ టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం మునిమోక్షం, ఇబ్రహీంబాద్ గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు, సోషల్ మీడియా కో కన్వీనర్లు మల్లేశ్, సతీశ్, సర్పంచ్ లక్ష్మణ్నాయక్, ఉప సర్పంచ్ వెంకటేశ్నాయక్, నాయకులు కేశవులు, నాగరాజు, కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు, గంగమ్మ, సంజీవ్, బీఎస్పీ నాయకులు శ్రీకాంత్, యాదయ్య, బాలు తదితరులు 100మందికిపైగా మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, సింగిల్విండో చైర్మన్ వెంకటయ్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజుయాదవ్, మాజీ వైస్ఎంపీపీ లక్ష్మయ్య పాల్గొన్నారు.