మాగనూర్, నవంబర్ 21 : నేరడగం సిద్దలింగేశ్వర స్వామి పశ్చిమాద్రి సంస్థాన విరక్తమఠంలో లక్షదీపోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దీపోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే అన్ని దేవుళ్లకు పూజలు చేసిన పుణ్యం వస్తుందన్నారు. అనంతరం ఆలయంలో పూజలు చేశారు. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. శ్రీ పంచమ సిద్ధలింగ మహాస్వాముల చరిత్రను ఆన్లైన్ వెబ్సైట్లో ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డితో కలిసి మంత్రి, ఎంపీ ప్రారంభించారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో భక్తులకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో మఠం వద్ద బందోబస్సు కల్పించారు. ఉదయం నుంచి వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన వేలాది భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, రైతుబంధు సమితి జిల్లా సభ్యురాలు చిట్టెం సుచరితారెడ్డి, కర్ణాటక రాష్ర్టంలోని గురుమిట్కల్, యాద్గిర్ ఎమ్మెల్యేల కుమారులు శరణుగౌడ, మహేశ్వర్రెడ్డి, 25 మఠాల పీఠాధిపతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.