కొల్లాపూర్, నవంబర్ 21: ప్రజాస్వామ్యంగా ప్రజలచేత రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఢిల్లీ పెద్దల ఫిరాయింపుతో వచ్చిన సన్యాసులను పట్టించి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తం చేశామని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ కుట్రలను భగ్నం చేసి తొలిసారిగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రానికి సోమవారం వచ్చిన ఎమ్మెల్యే బీరానికి గులాబీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు నాగర్కర్నూల్ చౌరస్తా నుంచి కొల్లాపూర్ వరకు బైక్ర్యాలీలు, పూలవర్షంతో స్వాగతం పలికారు. పట్టణంలో రోడ్షోలో భాగంగా జ్యోతిబారావు ఫూలే, తెలంగాణ తల్లి, చాకలి ఐలమ్మ, బాబు జగ్జీవన్రాం, అంబేద్కర్ విగ్రహాలు, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన 8 రాష్ర్టాల ప్రభుత్వాలను కూల్చిన ఘనత ఢిల్లీపెద్దలకే దక్కిందని ఎద్దేవా చేశారు. అదే వక్రబుద్ధితో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలను భగ్నం చేసి బీజేపీకి ఫుల్స్టాప్ పెట్టినట్లు పేర్కొన్నారు. కేంద్రం నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. కొల్లాపూర్ నియోజకరవర్గ అభివృద్ధి,సంక్షేమం కోసం ఏ త్యాగానికైనా తాను సిద్ధమేనన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు బెదిరింపులకు భయపడమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో మాట్లాడే చిల్లరగాళ్లకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా నిధుల నుంచే సోమశిల-సిద్ధేశ్వరం వంతెన, నాలుగు వరుసల రోడ్డును తెలంగాణ ప్రభుత్వం ద్వారా సాధించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కొందరు పనికిమాలిన వెధవలు సీఎం కేసీఆర్, తనపై బట్టకాల్చి మీదేస్తున్నారని, వారిని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.