కల్వకుర్తి రూరల్, నవంబర్ 20 : ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉన్న ఆలయాన్ని పునర్మించుకునేందుకు గ్రామస్తులంతా చేయిచేయి కలిపారు. గ్రామపెద్దలు, ఆలయ అభివృద్ధి మండలి సభ్యులు, దాతల సహకారంతో చందాలు పోగు చేసి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాదాపు వెయ్యి ఏండ్ల కిందట ప్రస్తుత కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో నిర్మించిన త్రికూటాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.
ఈ ఆలయంలో వేంకటేశ్వరస్వామి, నర్సింహస్వామి, నందీశ్వరుడి విగ్రహాలు, శివలింగం, ధ్వజ స్తంభంతోపాటు ఆలయ ఆవరణలో ఆంజనేయస్వామి విగ్రహాలున్నాయి. ఆలయం లో మహామండపం, అందులో ఉన్న చిత్రాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. గతంలో శివస్వాములు, భక్తులు, గ్రామస్తులు ఆలయానికి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు.
శివరాత్రి, ఏకాదశి, ఇతర ముఖ్య పండుగల సమయంలో మాత్రమే ఆలయంలో ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారని.., మిగతా వేళల్లో పూజలు చేసే వారే కరువయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఆలయానికి వేల ఎకరాల మాన్యాలున్నా.. ఆల య నిర్వాహణ కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో భక్తుల రాక తక్కువైందని పేర్కొంటున్నారు.
మార్చాల గ్రామంలో వెయ్యి ఏండ్ల చరిత్ర గల వేంకటనృసింహశివాలయం అప్పటి ఆధ్యాత్మికత, శిల్పకళకు అద్దంపడుతున్నాయి. కల్వకుర్తి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో కల్వకుర్తి-జడ్చర్ల ప్రధాన రహదారిపై ఉన్న ఆలయంలో గతంలో యజ్ఞయగాదులు బ్రహ్మాండంగా నిర్వహించేవారని గ్రామపెద్దలు పేర్కొంటున్నారు. తెలంగాణ కందూరు చోళుల కాలంలో దాదాపు వెయ్యేండ్ల కిందట త్రికూట ఆలయాన్ని నిర్మించినట్లు పాలమూరు జిల్లా సారస్వతం, దుందుభీ, పీవీ పరబ్రహ్మ శాస్త్రీ రచించిన కాకతీయులు అనే పుస్తకాల ప్రకారం తెలుస్తున్నది. ఆలయంలో ఒక వైపు నృసింహస్వామి, మధ్య భాగంలో వేంకటేశ్వర స్వామి, మరో వైపు శివుడి విగ్రహం ఉన్నది. త్రికూటాలయంలోని శివలింగం కాశీలోని విశ్వేశ్వరుడి విగ్రహం కన్నా పెద్దది.
ఇలా ఒకే ఆలయ ప్రవేశ ద్వారంలో ముగ్గురు దేవతామూర్తులు ఉన్న ఆలయాలుచాలా అరుదు. ఆలయ ఆవరణలోని మహా మండపం, అక్కడ ఉన్న రాతి స్తంభాలు అలనాటి శిల్పకళకు తార్కాణాలుగా నిలుస్తున్నాయి. త్రికూటాలయానికి సంబంధించిన విశిష్టత, నిర్మాణశైలి వంటి పలు అంశాలను కల్వకుర్తి నియోజకవర్గంలోని రాచూర్ గ్రామంలో ఉన్న శాసనాల్లో పొందుపరిచారు. ఈ ఆలయంలో 50 ఏండ్ల కిందట సోమయాగాన్ని వేదర్శుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఆంజనేయుడి గుడి, నవగ్రహ, నాగ దేవతలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడా లేని త్రికూట ఆలయానికి గతంలో రెండు, మూడు పర్యాయాలు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అయినా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టకపోవడంతో నేడు ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్తులు తలంచారు. దాదాపుగా రూ.50 లక్షల చందాలను పోగుచేశారు. ముందు గా ఆలయ ముఖద్వారం నిర్మించి.. గతేడాది దసరా పర్వదినాన జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి దంపతులతో ప్రారంభించారు.
అలాగే ఆలయ ఆవరణలో నాగ దేవతామూర్తులు, నవగ్రహ విగ్రహాలకు ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేసి శా స్ర్తోక్తంగా ప్రతిష్ఠించారు. ఆలయంలోని గర్భగుడి పై కప్పును పూర్తిగా తొలగించి నూతనంగా నిర్మించారు. దీంతోపాటు యువత, విద్యావంతులకు ఉపయోగపడే లా ఆలయ ఆవరణలో ప్రపంచ జ్ఞాన విజ్ఞాన కేంద్రాన్ని ఎండోమెంట్ అధికారుల సహకారంతో నిర్మించేలా ఆలయాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రతిపాదిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి అన్ని పనులు పూర్తి చేశాక ప్రారంభించనున్నారు.