మహబూబ్నగర్, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వాళ్లను కూడా క్షమించబోమని అధికార పార్టీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు మహబూబ్నగర్ పట్టణంలో విలువైన ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఆక్రమించిన 43వ వార్డు కౌన్సిలర్ బురుజు సుధాకర్రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. అక్రమాలకు పాల్పడిన కౌన్సిలర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్ వెల్లడించారు. రాంనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సంబంధించిన స్థలాన్ని బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న కౌన్సిలరే ఆక్రమించి పార్టీకి చెడ్డపేరు తీసుకురావడం సహించరాని విషయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలను టీఆర్ఎస్ పార్టీ సహించబోదన్నారు. కౌన్సిలర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా అనర్హత వేటు వేయాలని పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఇటీవలే దొంగనోట్ల కేసులో సుధాకర్రెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా.. పట్టణంలోని ఓ మహిళకు చెందిన స్థలాన్ని కూడా ఆక్రమించినట్లు కేసు నమోదైందన్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని ఇటీవలే లోక్ అదాలత్లో పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ మనోహర్ ఫిర్యాదు చేశారని చెప్పారు. లోక్ అదాలత్ ఆదేశాలతో మహబూబ్నగర్ అర్బన్ తాసిల్దార్ పార్థసారధి విచారణ చేపట్టారు. 680 గజాల విలువైన స్థలాన్ని ఆక్రమించినట్లు విచారణలో వెల్లడైంది. తాసిల్దార్ తెలిపిన కథనం మేరకు.. మున్సిపాలిటీ పరిధిలోని గ్రామకంఠం భూమి ఒక ఎకరాను 1999లో పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించగా.. దశలవారీగా ఇక్కడ పాఠశాల భవనాలు నిర్మించారు. కౌన్సిలర్ సుధాకర్రెడ్డి పాఠశాలకు చెందిన 680 గజాల స్థలాన్ని మొదట కిష్టమ్మ, తర్వాత వెంకటగోపాల్, ఆ తర్వాత వడ్ల లక్ష్మయ్య కొన్నట్లుగా తప్పుడు రిజిస్ట్రేషన్లు చూపించారు. అనంతరం లక్ష్మయ్య తన కుమారుడు బాలరాజుకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసినట్లు చూపించి.. ఆయన ద్వారా కౌన్సిలర్ కొనుగోలు చేసినట్లుగా అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఉర్దూ డాక్యుమెంట్ను ఆధారంగా చూపించి తర్జుమా చేసినట్లుగా దొంగ డాక్యుమెంటు సృష్టించి కొనుగోలు ప్రక్రియను చేపట్టినట్లు విచారణలో వెల్లడైందని తాసిల్దార్ తెలిపారు. అలాగే మాజీ కౌన్సిలర్ రామాంజనేయులు సైతం ఇదే పాఠశాల స్థలంలో 173 గజాల స్థలాన్ని ఆక్రమించుకొని ప్రహరీ నిర్మించుకున్నారని వెల్లడించారు. పాఠశాల స్థలాన్ని ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నలుగురిపై కేసు నమోదు..
ప్రభుత్వ భూమిని నకిలీ కాగితాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్న కౌన్సిలర్ సుధాకర్రెడ్డితోపాటు వి.బాలరాజు, మోరెడ్డి విద్యాసాగర్, మలిషెట్టి రాకేశ్పై తాసిల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ ఎస్సై జగనాథం తెలిపారు.