ఆత్మకూరు, అక్టోబర్ 30: పేదల తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో ప్రధాన ఘట్టమైన అలంకార మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవానికి మున్సిపల్ పాలకమండలి నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. పట్టణం నుంచి కురుమూర్తి కొండల వరకు ఆభరణాల ఊరేగింపు భక్తజనుల మధ్య కొనసాగింది.
అంతకుముందు ఆత్మకూరు ఎస్బీఐలో భద్రపరిచిన కురుమతిరాయుడి స్వర్ణాభరణాలను బ్యాంక్ మేనేజర్ ప్రసాద్రావు, ఫీల్డ్ అసిస్టెంట్లు మదన్, ఎండీ గఫూర్, అకౌంటెంట్ విజయభాస్కర్, ఆలయ చైర్మన్ ప్రతాప్రెడ్డి సమక్షంలో ఈవో శ్యాంసుదరాచారి బ్యాంక లాకర్ను తెరిచారు. పట్టణానికి చెందిన గాడి వంశస్తులు స్వర్ణాభరణాల పెట్టెను బయటకు తీశారు. బ్యాంకు అధికారుల ఆధ్వర్యంలో ఆభరణాలకు పూజలు చేశారు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, జెడ్పీచైర్పర్సన్ సల్గుటి స్వర్ణసుధాకర్రెడ్డి అథితులుగా, మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్రెడ్డి దంపతులు, మక్తల్, దేవరకద్రకు చెందిన రాజకీయ పార్టీల నేతలు వర్కటం జగన్నాథ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, మధుసూదన్రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరలు ముఖ్యఅథితులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అనాదిగా వస్తున్న ఆచారం మేరకు గాడి వంశస్తులైన గాడి అశోక్కుమార్ స్వర్ణాభరణాల పెట్టెను తలపై పెట్టుకొని ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణలతో మార్మోగింది. కుర్వడోళ్లు, భాజాభజంత్రీలు, మేళతాళాలు, డీజే మోతల హోరు, శివసత్తుల పూనకాలు, పటాకుల మోతతో పట్టణం దద్దరిల్లింది. ఊరేగింపు పొడవునా వేలాదిగా భక్తులు ఆభరణాలను మొక్కేందుకు పోటీపడ్డారు. కురుమూర్తి గ్రామానికి చెందిన వివేకానంద పాఠశాల విద్యార్థులు ఊరేగింపులో కోలాటం ప్రదర్శన ఆకట్టుకున్నది. డిజిటల్ స్క్రీన్ల ముందు భారీ జనం వేడుకను తిలకించారు. చెరువుకట్టపై ఉన్న పరమశివుడి ఆలయానికి అభిముఖంగా ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ పూజలు చేసి ఆభరణాలను సాగనంపారు.
సీఐ కేఎస్ రత్నం, ఎస్సై పుట్టా మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆత్మకూరు నుంచి ప్రత్యేక ఎస్కార్ట్ కాన్వాయ్తో బయలుదేరిన ఆభరణాలు మదనాపురం మండలం కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని ముక్కెర రాజవంశస్తులు, సంస్థానాధీశుల కోటకు చేరాయి. అక్కడ ముక్కెర వంశీయుల రాజా శ్రీరాంభూపాల్రెడ్డి పూజలు చేశారు. అనంతరం కోట నుంచి కురుమూర్తి ఆలయం వరకు అమ్మాపురం గ్రామానికి చెందిన నంబి వంశస్తులు పాదయాత్రగా ఆభరణాలను కొండపైకి చేర్చారు. ప్రధాన ఆలయంలో ఆభరణాలకు పూజలు చేసిన ఎమ్మెల్యే చిట్టెం, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, చైర్మన్ ప్రతాప్రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, ఈవో సమక్షంలో ప్రధాన అర్చకులకు అప్పగించారు.
అనంతరం కాంచనగుహలో వెలసిన కురుమూర్తి రాయుడికి అలంకరించారు. స్వర్ణభూషితుడైన స్వామితో కాంచనగుహ స్వర్ణకాంతులతో వెలిగిపోయింది. కార్యక్రమంలో ఎంపీపీ బంగారుశ్రీనివాసులు, మున్సిపల్ చైర్పర్సన్ గాయిత్రీ యాదవ్, వైస్చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, జెడ్పీటీసీ శివరంజని, పీఏసీసీఎస్ అధ్యక్షులు గాడి కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, చిన్నచింతకుంట, కొత్తకోట, అమరచింత, నర్వ, మదనాపురం, దేవరకద్రకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ముఖ్యనాయకులు, తాసిల్దార్ మతీన్, కమిషనర్ రమేశ్, పార్టీ అధ్యక్షుడు రవికుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ శ్రీధర్గౌడ్, అధికారులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.