నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 25 ;దీపావళి సంబురాలను జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. చెడుపై మంచిని సాధించిన విజయానికి సూచికగా, మహిళా శక్తికి ప్రతిరూపంగా, అజ్ఞానమనే చీకటిని పారద్రోలి, విజ్ఞాన్ని ప్రసాదించాలని, సిరి సంపదలు కలగాలని కోరుకుంటూ ప్రజలు ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాల్లో దీపావళిని పురస్కరించుకొని పండుగ సందర్భంగా ఇండ్లు, వాణిజ్య, వ్యాపార సముదాయాలను విద్యుత్ దీపాలతో, బంతి పువ్వులతో అలంకరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా పటాకులు కాల్చి ఆనందం పంచుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని బాలసదనంలో కలెక్టర్ శ్రీహర్ష చిన్నారుల మధ్య దీపావళి పండుగను జరుపుకొన్నారు. పటాకులు కాల్చే సమయంలో సూచనలు అందించి, మిఠాయిలు పంచి పెట్టారు. ఎస్పీ వెంకటేశ్వర్లు క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించారు.