కృష్ణ/ఊట్కూర్/మాగనూరు, అక్టోబర్ 23 : దేశ ప్రజల మధ్య కులం, మతం పేరుతో బీజేపీ చిచ్చు పెడుతున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ధ్వజమెత్తారు. భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారు. దేశ ప్రజలంతా ఐక్య భారత్ను కోరుకుంటున్నారని తెలిపారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ఆదివారం కర్ణాటక నుంచి తెలంగాణలోకి ప్రవేశించింది. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం టై రోడ్డు సర్కిల్ వద్దకు చేరుకోగానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, పలువురు నాయకులు రాహుల్కు స్వాగతం పలికారు.
తెలంగాణలో రెండున్నర కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులద్దేశించి రాహుల్ మాట్లాడారు. దేశ సమగ్రతను కాపాడేందుకు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తన భారత్ జోడో యాత్ర కొనసాగనున్నట్లు తెలిపారు. కేంద్రం ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నదని విమర్శించారు. కాగా ఈ యాత్రలో కార్యకర్తల తోపులాటలతో పలువురు నాయకుల చెప్పులు, బూట్లు తెగిపోయాయి. కండువాలు సైతం జారిపడి కాళ్ల కింద నలిగిపోయాయి. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తోపులాటలో కింద పడిపోగా చేతికి దెబ్బ తగిలింది.
భారత్ జోడో యాత్ర చేపట్టి రాహుల్ చేతుల మీదుగా కృష్ణ మండలం టైరోడ్డు చౌరస్తాలో తెలంగాణతల్లి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసేందుకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. కానీ తెలంగాణ తల్లి విగ్రహం వైపు ఆయన కన్నెత్తి కూడా చూడలేదు. ఇక పార్టీలు నేతలు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అలాగే మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేత, మక్తల్ మాజీ ఎమ్మెల్యే దివంగత నర్సిరెడ్డి విగ్రహాన్ని హస్తం నేతలు పట్టించుకోకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. కనీసం పూలమాలలు వేయలేదు.
కాగా రాహుల్ ఈ ప్రాంతానికి వచ్చారని ఎందరో వయోవృద్ధులు, ఇందిరమ్మ అభిమానులు, నాటి కాంగ్రెస్ నాయకులు ఇందరమ్మ మనవడు అనే అభిమానంతో ఉత్సాహంతో కలుద్దామని వస్తే తుర్రుమని గాలిమోటర్ ఎక్కి వెళ్లిపోయాడని పలువురు ఆవేదనను వ్యక్తం చేశారు. ఇక కర్ణాటకలోని శక్తినగర్లోని అభిమానులు బీఆర్ఎస్ ఏర్పాటు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు చింపేయడం వివాదాస్పదమైంది. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేరు మీదున్న బ్యానర్లు ధ్వంసం చేశారు. దీనిపై టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి పనులు చేశారని ధ్వజమెత్తారు.