గద్వాల, అక్టోబర్ 23: జోగుళాంబ గద్వాల జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులు విపత్తును ఎదుర్కొంటున్నారు. గతేడాది అధిక దిగుబడి రావడంతో ఈ ఏడాది జిల్లాలో రైతులు ఎక్కువ భాగం పత్తిని సాగు చేశారు. రైతులు ఈ ఏడాది కూడా జిల్లాలోని వివిధ విత్తనాలు అమ్మే డీలర్ల వద్ద మూడు కంపెనీలకు చెందిన విత్తనాలు తెచ్చి పొలంలో విత్తుకున్నారు. పంట ఏపుగా పెరిగింది..ఈ ఏడాది దిగుబడి బాగా వస్తే అప్పులు తీరుతాయన్న రైతుల ఆశలు పంట చేతికి రాక ముందే అడిఆశలు అయ్యాయి.
పొలంలో మాత్రం మొక్క ఏపుగా పెరిగి పూత పిందే రాకపోవడంతో పాటు పూత పూసిన అది కూడా రాలిపోవడంతో రైతులకు ఏం చేయాలో తోచడం లేదు. పూత,కాయ నిలబెట్టు కోవడడానికి ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లి చుట్టపు చూపుగా పొలాలకు వెళ్లి చూసి వచ్చారే తప్పా రైతుల పంట కాపాడడానికి ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం లేదని అయిజ మండలం సంకాపురం, ఈడ్గోనిపల్లి రైతులు ఆరోపిస్తున్నారు.
పత్తి పంట పూత,కాయ రావడం లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారికి రైతులు ఫిర్యాదు చేసి కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరినా ఎటువంటి ఫలితం లేదని సంకాపురం రైతు వీరభద్రప్ప తెలిపారు. ఎకరాకు సుమారు రూ.30వేల పైనే పెట్టుబడి పెట్టినా రూపాయి చేతికి రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈడ్గోనిపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకట్రాములు తన ఎనిమిది ఎకరాల్లో ఓ కంపెనీకి చెందిన పత్తి పంట సాగు చేయగా పంట చేతికి వచ్చిన పూత రాలి పోవడం కాయ మాడి పోవడంతో తాను సాగు చేసిన పంట మొత్తాని తొలగించారు. తనకు రూ.2.50లక్షల పైనే నష్టం వాటిల్లిందని చెప్పారు. సంకాపురం, ఈడ్గోనిపల్లి గ్రామాల్లో సుమారు 300 ఎకరాల్లో రైతులకు నష్టం వాటిళ్లింది.
వానకాలం సీజన్లో రైతులు 2,22,927 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. ఒక్క అలంపూర్ తాలూకాలోనే 1,63,018 ఎకరాల్లో సాధారణ పత్తిని సాగు చేశారు. రైతులు డీలర్ల వద్ద తెచ్చి విత్తనాలు నాణ్యత లేక పోవడం వల్లే పంట పత్తి పంట పెరిగిన పూత కాయ నిలబడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నాణ్యత లేని విత్తనాల వల్లే పంట రావడం లేదని రైతులు ఆరోపిస్తుంటే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం సెప్టెంబర్ నెలలో బెట్ట రావడం, అక్టోబర్లో అధిక వర్షాలు కురువడం వల్ల వాతావరణ పరిస్థితుల్లో మార్పు వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు. ఇందులో ఎవరిది నిజమో రైతులు తేల్చుకోలేక పోతున్నారు. గురువారం జిల్లాలో శాస్త్రవేత్తలు రైతులు సాగు చేసిన పంట పొలాలు పరిశీలించి వాతావరణ మార్పుల వల్లే ఇలా జరిగిందని చెప్పడంతో రైతులు వారిపై మండి పడుతున్నారు. కంపెనీలకు వత్తాలు పలుకుతూ తమ కడుపు కొడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమకు న్యాయం చేసి నాణ్యత లేని విత్తనాలు అందించిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు తాము సాగు చేసిన పత్తి పంట మొక్కలను తీసుక వచ్చి ఆందోళన చేపట్టారు. ఈనెల 26వరకు న్యాయం జరగకపోతే 27తర్వాత కలెక్టరేట్ను ముట్టడిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. తమకు నాణ్యత లేని విత్తనాలు ఇచ్చిన కంపెనీలు, డీలర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మట్టితో తయారుచేసిన దీపంతెల(దివ్వెలు)కు మంచి గిరాకీ ఏర్పడింది. దీపాల పండుగ వేళ్ల మట్టి దీపంతెల్లోనే దీపాలు పెట్టేందుకు జనం ఆసక్తి కనబరుస్తుంటారు. మట్టి దీపంతెలు అందుబాటులో లేని సమయంలో స్టీలు, ఇనుము, ప్లాస్టిక్తో చేసిన దీపంతెలను వాడేవారు. కానీ, ఇటీవల మట్టి దీపంతెలు అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరూ వీటిలోనే దీపాలు వెలిగిస్తున్నారు. అంతేకాకుండా మట్టి దీపంతెలతో దీపారాధన చేస్తే మంగళకరం అని విశ్వసిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల ఆకారాల్లో దీపంతెలు లభిస్తున్నాయి. సుమారు 15రకాల ఆకారాల్లో దీపంతెలు ఆకట్టుకుంటున్నాయి. వివిధ ఆకారాల్లో తయారు చేయడంతో పాటు మరింత ఆకట్టుకునేలా రంగులు వేసి మరీ విక్రయిస్తున్నారు. కుమ్మరులు తయారు చేసిన దీపంతెలతో పాటు యంత్రాలతో తయారుచేసిన దీపంతెలు మార్కెట్లో లభిస్తున్నాయి.