నవాబ్పేట, అక్టోబర్ 23 : మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో గుప్తనిధులు ఉన్నాయంటూ.. కొందరు దుండగులు ఛూ..మంతర్ పేరుతో మోసం చేసి.. రైస్మిల్ యజమానితో సుమారుగా రూ.25 లక్షలు కాజేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్సై పురుషోత్తం వెల్లడించారు. మహబూబ్నగర్కు చెందిన ఖాజాపాషా, భాస్కర్, మ్యాదరి సురేందర్, జాఫర్ హుస్సేన్, నాగం రాజు, మహ్మద్ ఫయాజ్ ఎనిమిది రోజుల కిందట నవాబ్పేటలోని యశ్వంత్ రైస్ మిల్లులో గుప్తనిధులు ఉన్నాయని, వాటిని తీసి ఇస్తామని నమ్మబలికారు. ఇందుకు అధిక మొత్తంలో ఖర్చు అవుతుందని చెప్పారు.
ఇది నమ్మిన యజమాని నుంచి పలు దఫాలుగా దాదాపు రూ.25 లక్షల వరకు వసూలు చేసినట్లు చేశారు. అక్కడ ఉన్నాయి.. ఇక్కడ ఉన్నాయి.. అని చెప్పి తవ్వకాలు జరపగా ఎక్కడా లేకపోవడంతో మోసిపోయినట్లు గుర్తించి యశ్వంత్ గుప్తా నాలుగైదు రోజుల కిందట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి మహబూబ్నగర్కు చెందిన ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి రూ.1.25 లక్షల నగదు, 3 సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఏఎస్సై ఆనంద్, సిబ్బంది రాజుగౌడ్, మజహర్ పాల్గొన్నారు.